మధురవాడ: కూటమి నాయకులు బరి తెగించారు. సెలవు రోజున ప్రభుత్వ పాఠశాలలో హల్చల్ చేశారు. స్నేహితుల దినోత్సవం పేరుతో స్కూల్లో సంబరాలు చేసుకోవడం వివాదాస్పదమవుతోంది. ఆదివారం సెలవు రోజున చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోకి టీడీపీ నాయకులు అనధికారంగా ప్రవేశించారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కేక్ కట్ చేసి కేరింతలు కొట్టారు. ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ ఫొటోలకు పోజులిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ కార్పొరేటర్ భర్తతో పాటు జనసేనకు చెందిన ఓ మహిళా నాయకురాలు, పలువురు నేతలు ఉండటం గమనార్హం. ప్రభుత్వ విద్యా సంస్థలో అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.


