గ్రీన్ ఛానల్కు చిరువ్యాపారుల ఆటంకం
సత్యం జంక్షన్లో ఎస్ఐపైకి కర్రతో దూసుకొచ్చిన యువకుడు
సంయమనం పాటించిన ఎస్ఐ శ్రీనివాసరావు
ఎంవీపీకాలనీ: సత్యం జంక్షన్ జాతీయ రహదారిపై హోమ్ గ్యాడ్జెట్లు విక్రయిస్తున్న చిరువ్యాపారులు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావుతో వాగ్వాదానికి దిగిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం నుంచి నగరానికి అవయవాలను తరలిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆదివారం మధ్యాహ్నం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఎంవీపీ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు సత్యం జంక్షన్లో ట్రాఫిక్ను నియంత్రిస్తూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో అవయవాలను తరలిస్తున్న వాహనం హనుమంతవాక వైపు నుంచి సత్యం జంక్షన్కు చేరుకుంటుండటంతో, జాతీయ రహదారిపై హోమ్ గ్యాడ్జెట్లు విక్రయిస్తున్న రాజస్థాన్కు చెందిన చిరువ్యాపారులను రహదారి పక్కకు వెళ్లాలని ఎస్ఐ సూచించారు.
ఎస్ఐపైకి కర్రతో దూసుకొచ్చిన యువకుడు
అయితే వారు అందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. వారిలో ఓ యువకుడు కర్రతో ఎస్ఐపైకి దూసుకొచ్చి బెదిరించడంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే అవయవాలను తరలిస్తున్న వాహనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎస్ఐ శ్రీనివాసరావు సంయమనం పాటించారు. గ్రీన్ ఛానల్ పూర్తయి వాహనాలు వెళ్లిపోయిన అనంతరం వ్యాపారులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, అప్పటికే వారు అక్కడి నుంచి జారుకోవడం గమనార్హం.


