మహారాణిపేట: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే కర్త, కర్మ, క్రియ అని, కానీ చంద్రబాబు తన ఘనతగా చెప్పుకుంటూ మరోసారి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. భూసేకరణ నుంచి అన్ని అనుమతుల సాధన వరకు ప్రతి దశను జగన్ స్వయంగా పర్యవేక్షించారని ఆమె గుర్తు చేశారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే 2,750 ఎకరాల భూసేకరణ పూర్తి చేయడంతో పాటు రైతులకు నష్టపరిహారం, నిర్వాసితులకు పునరావాసం కల్పించారన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో సమన్వయం చేసి విమానాశ్రయానికి అవసరమైన అన్ని అనుమతులను జగన్ సాధించారన్నారు. 2023లోనే ఎయిర్పోర్టుకు భూమిపూజ చేయగా, మొత్తం నిర్మాణంలో 70 శాతం పనులు జగన్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని, మిగిలిన 30 శాతం పనులు చేసి మొత్తం ఘనత తమదేనని చెప్పుకోవడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలోనే విశాఖపట్నం–భోగాపురం మధ్య ఆరు లేన్ల రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని జగన్ కోరిన విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఉత్తరాంధ్రలో వలసలను నివారించి ఉపాధి అవకాశాలు పెంచాలనే లక్ష్యంతోనే భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని జగన్ ముందుకు తీసుకెళ్లారని వెల్లడించారు.


