ఉక్కునగరం: ఉద్యోగుల సహకారం, సమష్టి కృషితో స్టీల్ప్లాంట్కు పూర్వ వైభవం తీసుకురావడం ఖాయమని సీఎండీ ఎం.ఎన్.వి.ఎస్. ప్రభాకర్ అన్నారు. సీఎండీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శనివారం తొలిసారిగా కార్మిక సంఘాల నాయకులతో సమావేశమైన ఆయన, ప్లాంట్ ఎదుర్కొంటున్న ఆర్థిక, సాంకేతిక సమస్యలు, వాటి పరిష్కారానికి చేపడుతున్న చర్యలను వివరించారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మూడు నెలల్లోనే పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు. స్క్రాప్ విక్రయం ద్వారా ఆదాయం పెంచడంతో పాటు బ్లాస్ట్ ఫర్నేస్లో పీసీఐ వినియోగం పెంచి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఫినిష్డ్ ఉత్పత్తుల తయారీని పెంచడం, గ్యాస్ ఉత్పత్తిని మెరుగుపరచడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ప్లాంట్ పర్సనల్ ఇన్చార్జ్ రాధికతో పాటు కార్మిక సంఘాల నాయకులు పి.వి.రమణమూర్తి, అయోధ్యరామ్, రామ స్వామి, డి.వి.రమణారెడ్డి, డొక్క నర్శింగరావు, జగదీష్, రమణ, సురేష్బాబు పాల్గొన్నారు.


