మహారాణిపేట: మత్స్యకారులంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చులకన భావమని విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు తీవ్రంగా విమర్శించారు. గురువారం మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను పరామర్శించేందుకు ప్రభుత్వం నుంచి ఒక్క మంత్రి కూడా వెళ్లలేదని మండిపడ్డారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్వయంగా బాధిత కుటుంబాలను కలిసి రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తే, దానిపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. హుద్హుద్ తుఫాన్ ఇళ్లపై తప్పుడు ఆరోపణలు చేయడం కాదని, దమ్ముంటే విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు సవాల్ విసిరారు. గత ఐదేళ్ల సంక్షేమం, అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. రాష్ట్ర మత్స్యకార విభాగం అధ్యక్షుడు పేర్ల విజయచందర్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి జూలై 14న బాధిత కుటుంబాలను పరామర్శించి, తన సొంత నిధుల నుంచి ఏడుగురికి రూ.7 లక్షల చొప్పున మొత్తం రూ.49 లక్షల ఆర్థిక సాయం అందించారని తెలిపారు. మత్స్యకారుల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు వారిని విస్మరించడం సరికాదన్నారు. అలాగే జనసేన నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ భూకబ్జాలు, అవినీతికి పాల్పడుతున్నారని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పళ్లా దుర్గారావు ఆరోపించారు. ఆయన కబ్జాలపై సొంత పార్టీ మాజీ కార్పొరేటరే ఫిర్యాదు చేశారని పేర్కొంటూ, దీనిపై నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు ఉమ్మడి స్వాతి దాస్, మువ్వల లక్ష్మీ, సుమన్ యాదవ్, ఉమ్మడి దాస్, ఉమ్మడి కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.


