మహారాణిపేట: ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి–2026లో పేర్కొన్న మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ డాక్టర్ ఎం. సుధాకరరావు అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన ఉమ్మడి విశాఖ జిల్లాలోని 39 మండలాల ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, పరిపాలనాధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిలోని నిబంధనలను ప్రతి గ్రామంలో సమర్థవంతంగా అమలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ముఖ్య నిర్వహణాధికారి పి. నారాయణమూర్తి మాట్లాడుతూ అన్ని మండలాల అధికారులు నియమావళిని తప్పనిసరిగా పాటించి క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ సీఈవో కె. రాజ్కుమార్, జిల్లా పంచాయతీ అధికారి ఎంవీవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


