గోపాలపట్నం: విధి నిర్వహణకు వెళ్తున్న ఓ సచివాలయ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక వంద అడుగుల రహదారిలోని కుంచుమాంబ కాలనీలో నివాసముంటున్న బేత అరుణ్కుమార్ (32) వడ్లపూడి సచివాలయంలో ఎమెనిటీస్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఎన్నికల సెల్లో విధులు ఉండటంతో బుధవారం మధ్యాహ్నం సుమారు 3.45 గంటలకు ద్విచక్ర వాహనంపై జీవీఎంసీ కార్యాలయానికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఆర్అండ్బీ జంక్షన్ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన భారీ కంటైనర్ లారీ ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆయన లారీ చక్రాల కింద పడిపోయి, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతుడి తండ్రి అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరుణ్కుమార్ హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ, లారీ అత్యంత వేగంగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువై ప్రాణాలు దక్కలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు
అరుణ్కుమార్కు గత ఏడాది నవంబర్ 27న వివాహం జరిగింది. పెళ్లయి ఏడాది కూడా పూర్తికాకముందే జరిగిన ఈ విషాదం కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. అన్యోన్యంగా సాగుతున్న వారి దాంపత్య జీవితాన్ని ఈ ప్రమాదం ఒక్కసారిగా ఛిన్నాభిన్నం చేసిందంటూ బంధువులు, కుటుంబ సభ్యులు విలపించారు.
అరుణ్కుమార్ తండ్రి టైలరింగ్ వృత్తితో కుటుంబాన్ని పోషిస్తున్నారు. చెల్లికి వివాహం కాగా, అరుణ్కుమార్ తల్లిదండ్రులతో కలిసి నివసించేవారు. కుటుంబానికి అండగా నిలిచిన కుమారుడిని కోల్పోవడంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
భారీ కంటైనర్ లారీ ఢీకొనడంతో
అక్కడికక్కడే మృతి


