అల్లిపురం: సిటీ పోలీసు విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ శనివారం ఆర్మడ్ రిజర్వ్ మైదానంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి హాజరై శాంతి కపోతాలను గాలిలోకి ఎగురవేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం ఎంతో అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఫిట్నెస్ను జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ వార్షిక స్పోర్ట్స్ మీట్ ఈ నెల 14వ తేదీ వరకు జరుగుతుంది. ఈ పోటీల్లో వెస్ట్, సౌత్, నార్త్, హార్బర్, ఈస్ట్, ద్వారకా సబ్–డివిజన్లు, ట్రాఫిక్ డివిజన్, స్పెషల్ వింగ్ టీమ్ (స్పెషల్ బ్రాంచ్, సైబర్ క్రైమ్, టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్, వుమెన్ పోలీస్ స్టేషన్, సీసీఆర్బీ), క్రైమ్ సబ్–డివిజన్, సిటీ ఆర్ముడ్ రిజర్వ్ తదితర మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. కార్యక్రమం ప్రారంభంలో కమిషనర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి పురుషుల 800 మీటర్ల పరుగు పోటీకి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో డీసీపీ–1 (లా అండ్ ఆర్డర్), డీసీపీ–2 (లా అండ్ ఆర్డర్), డీసీపీ (క్రైమ్స్), ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఆర్ఐలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


