గడువు పొడిగింపు
వికారాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ అధికారులకు చుక్కలు చూపిస్తోంది. సకాలంలో ఎస్ఐఆర్ను పూర్తి చేయాలని పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కానీ నోటీసులు అందుకున్న మ్యాపింగ్ కాని, అనామలీస్ ఓటర్లు స్పందించడం లేదు. జిల్లాలో మొత్తం 10,17,671 మంది ఓటర్లు ఉండగా సర్ మొదటి విడతలో చనిపోయిన వారు, పెళ్లిళ్లు చేసుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, ఇతర ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న 2,10,842 మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. తదనంతరం 8,06,829 మంది క్రియాశీలకంగా ఉన్నట్లు గుర్తించారు. వీరిలో పేర్లు, వివరాలు తప్పుగా నమోదు చేసుకున్న వారు 2,10,842 మంది ఉన్నారు. ఇందులో 1,85,228మందికి నోటీసులు ఇచ్చారు. మిగిలిన వారికి ఇవ్వాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారిలో కేవలం 43,224 మందే స్పందించారు. అధికారులను కలిసి సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించారు.
వలస ఓటర్లపై..
ఎస్ఐఆర్ ప్రక్రియ వలస ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండు చోట్ల ఓట్లు ఉంటే తొలగిస్తే ఎవరికి నష్టం లేదుకానీ.. ఒకే చోట ఉన్న ఓటును తొలగించే ప్రమాదం కనిపిస్తోంది. తండాలు, మారుమూల గ్రామాలకు చెందిన అనేక మంది పూణే, ముంబై, బెంగళూరు తదితర పట్టణాలకు వలస వెళ్లారు. వారికి ఇక్కడే ఓటు ఉంది. ఎన్నికలు జరిగిన ప్రతి సారీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారు. నోటీసులు జారీ చేసే వారిలో ఎక్కువ మంది వారే ఉన్నట్లు సమాచారం. ఎక్కడెక్కడో ఉన్నందున ఇక్కడికి వచ్చి నోటీసులకు వివరణ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీంతో అర్హులైన ఓట్లు జాబితా నుంచి తొలగించే ప్రమాదం పొంచిఉంది. దీనిపైనే రాజకీయ పార్టీలు, నేతలు ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు వికారాబాద్ పట్టణంలోని గంగారంలో 421 మందికి నోటీసులు ఇవ్వగా ఇప్పటి వరకు 210 మంది మాత్రమే స్పందించారు. జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రామాలు, తండాల్లో చెప్పాల్సిన పని లేదు. దోమ మండలం మైలారం పంచాయతీ అనుబంధ గ్రామాల్లో రెండు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఒక బూత్ పరిధిలో 352 మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా 254 మందికి ఇచ్చారు. మరో 98 మందికి ఇవ్వాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటి వరకు పది శాతం కూడా స్పందించలేదు.
ప్రధాన సమస్యలివే..
నోటీసులు ఇచ్చే విషయంలోనూ.. వారి నుంచి ధ్రువపత్రాలు తీసుకునే విషయంలోనూ అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఓటర్లు అందుబాటులో లేకపోవడంతో బీఎల్ఓలు వారి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇస్తున్నారు. వారు ఇచ్చే సమాచారాన్ని అధికారులు అంగీకరించడంలేదు. ఓటర్లు వచ్చి ఫొటో దిగి సరైన పత్రాలు అందజేయాలని చెబుతున్నారు. తండ్రీ కొడుకులు, ఇతర కుటుంబ సభ్యులకు వయసులో వ్యత్యాసం ఉంటే ఇతర తప్పులు ఉంటే 12 రకాల సర్టిఫికెట్లతో సరిపోయేది ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంది. అయితే ఏ సమస్య ఉంటే వారు ఏ సర్టిఫికెట్ ఇవ్వాలలో బీఎల్ఓలకు కూడా అవగాహన లేదు. దీంతో అవసరమైన సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సకాలంలో ఇవ్వడం లేదు. ఇది కూడా సర్ ప్రక్రియ ఆలస్యం అవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.
నోటీసులు ఇచ్చినాసమాచారం ఇవ్వని ఓటర్లు
అధికారులపై పెరుగుతున్న ఒత్తిడి
ధ్రువపత్రాలు ఇవ్వకుంటే తొలగనున్న మరిన్ని ఓట్లు
వలస వెళ్లిన వారిపై ప్రభావం
జిల్లాలో సర్ ప్రక్రియ ఇలా..
మ్యాపింగ్ కాని, అనామలీస్ ఓటర్లు 2,6,7873 మంది
నోటీసులు అందుకున్న వారు 1,85,228
ఇంకా ఇవ్వాల్సినవి 82,224
స్పందించిన జనం 43,224 మందే
ధ్రువపత్రాల అందజేతకు గడువు పొడిగింపు
నవంబర్ 5వరకు అవకాశం,
9న ఓటర్ల తుది జాబితా ప్రచురణ
మ్యాపింగ్ కాని, అనామలీస్ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ధ్రువపత్రాల అందజేతకు, అభ్యంతరాల స్వీకరణకు గడువు పొడిగించింది. 8,06,829 మంది క్రీయాశీలక ఓటర్లలో మ్యాపింగ్ కాని వారు 35,262, పేర్లు, వివరాలు తప్పుగా నమోదు చేసుకున్న వారు 2,32,611 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు కేటగిరీల్లో 2,67,873 మంది ఉండగా 1,85,228 మందికి నోటీసులు జారీ చేశారు. మరో 82224 మందికి నోటీసులు త్వరలో ఇవ్వనున్నారు. ఇప్పల వరకు కేవలం 20 శాతం మంది ఓటర్లు మాత్రమే స్పందించారు. నిర్ణీత గడువుగా సమాచారం ఇవ్వకుంటే వీరి ఓట్లు తొలగించే అవకాశం ఉంటుంది. అయితే ధ్రువపత్రాల అందజేతకు ఎన్నికల సంఘం గడువు పొడించింది. నవంబర్ 5వ తేదీ వరకు అవకాశం కల్పించింది, నవంబర్ 9న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు.


