జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు ఇలా..
బషీరాబాద్: ఇల్లు పూర్తయింది.. గృహప్రవేశం చేసుకున్నారు. కానీ.. ప్రభుత్వం నుంచి చివరి బిల్లు మాత్రం అందలేదు. అప్పులు చేసి ఇంటిని నిర్మించుకున్న పేద కుటుంబాలు వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నాయి. బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎప్పుడు వస్తాయో స్పష్టత లేదు. నిర్మాణంలో ఒక్కో దశ పూర్తవుతున్నా సాయం సకాలంలో అందడం లేదు. దీంతో సొంతింటి కల నెరవేరిన ఆనందం కంటే.. అప్పుల భారం, బిల్లుల నిరీక్షణే మిగులుతోంది. ప్రజాప్రతినిధుల సమక్షంలో గృహప్రవేశాలు ఆర్భాటంగా సాగుతున్నా.. తుది చెల్లింపుల కోసం లబ్ధిదారులు మాత్రం పడిగాపులు కాస్తున్నారు.
నత్తనడకన పనులు
జిల్లాలో మొదటి విడత కింద 12,467 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 9,237 ఇళ్లకు మార్కింగ్ ఇచ్చారు. 3,230 ఇళ్ల పనులు నేటికీ ప్రారంభం కాలేదు. ఇప్పటివరకు 7,982 గ్రౌండింగ్ పూర్తయింది. బేస్మెంట్ లెవల్లో 1,498, రూఫ్ లెవల్లో 723 ఉన్నాయి. 3,279 స్లాబ్ దశ పూర్తి కాగా 2,482 ఇళ్లు అందుబాటులోకి వచ్చాయి.
661 ఇళ్లకే చెల్లింపులు
నిర్మాణాలు పూర్తయిన 2,482 ఇళ్లలో 661 ఇళ్లకే చెల్లింపులు జరిగాయి. ఇంకా 1,821 ఇళ్లకు తుది బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అంటే పూర్తయిన గృహాల్లో మెజారిటీ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తం అందలేదు. దీంతో నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చడం భారంగా మారింది. బీఎల్, ఎల్ఎల్, ఆర్ఎల్ దశల్లో ఉన్న గృహాలకు సైతం చెల్లింపులు నిలిచిపోయాయి. ఒక దశ బిల్లు రాకపోవడంతో తదుపరి పనులకు సొంత డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. దీంతో పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.
కొరవడిన పర్యవేక్షణ
మంజూరైన ఇళ్లలో 3,230 ఇంకా ప్రారంభం కాకపోగా.. పూర్తయిన 2,482లో 1,821 ఇళ్లకు బిల్లులు రాకపోవడం పరిస్థితిని స్పష్టం చేస్తోంది. నిర్మాణ పురోగతికి అనుగుణంగా చెల్లింపులు జరగకపోవడంపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ మొత్తాలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు.
ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం
నిర్మాణాల్లో కూడా..
అప్పులు చేసి పనులు
ఆందోళనలో లబ్ధిదారులు
వెంటనే చెల్లించాలని విన్నపాలు
మంజూరైనవి – 12,467
మార్కింగ్ ఇచ్చినవి 9,237
పనులు ప్రారంభం కానివి 3,230
గ్రౌండింగ్ పూర్తయినవి 7,982
బేస్మెంట్ లెవల్ 1,498
రూఫ్ లెవల్ 723
స్లాబ్ పూర్తయినవి 3,279
నిర్మాణం పూర్తయినవి 2,482
చెల్లింపులు జరిగినవి 661
తుది బిల్లులు పెండింగ్ 1,821


