కొడంగల్: మున్సిపల్ పరిధిలోని గుండ్లకుంట గ్రామంలో హనుమాన్ ఊరేగింపు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ మాసం ముగింపు సందర్భంగా అమావాస్యను పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ పూజల్లో పాల్గొన్నారు. హనుమాన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం అన్న ప్రసాదం పంపిణీ చేశారు.
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లాల్సింగ్ శ్రీనివాస్ నాయక్ సూచించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించుకోవాలన్నారు. ఇందుకు పోలీసులు, కక్షిదారులు, న్యాయవాదులు సహకరించాలని ఆయన కోరారు.
బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య
అనంతగిరి: అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అ ణచలేరని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బీ కృష్ణయ్య అన్నారు. ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ శుక్రవారం ఇచ్చిన చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో పోలీసులు కృష్ణయ్యను, ఆశ వర్కర్ల యూనియన్ నాయకులను అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు విజయ, లలిత, అనసూయ, కళావతి, రజిత, రమణి, మాధవి, మార్తా, సునీత, అనిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: జిల్లాలో వరి ధాన్యం సేకరణకు 129 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వరి కొనుగోలుపై సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్లు సేకరించాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి కవిత, జిల్లా మార్క్ఫెడ్, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కుల్కచర్ల: మండలంలోని బండవెల్కిచర్ల గ్రామంలో కొలువుదీరిన పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయం శుక్రవారం భక్తుల సందడిగా మారింది. శ్రావణ మాసం ముగింపు సందర్భంగా భారీగ తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అమృత హస్తం సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ మైపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు.


