సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వర్షాకాల సన్నద్ధత, ట్రాఫిక్ నిర్వహణపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండాముందస్తు చర్యలు చేపట్టాలని కమిషనర్ ఎం.రమేష్ వివిధ విభాగాల అధికారుల్ని కోరారు. సోమవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్లో ట్రాఫిక్ నిర్వహణపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. దెబ్బతిన్న రోడ్లు, గుంతలకు మరమ్మతులతోపాటు ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు అవసరమైన చోట్ల కొత్తగా ఫ్రీ లెఫ్ట్ల ఏర్పాటు, ఉన్న వాటి అభివృద్ధి, కీలక కూడళ్లలో కొత్త ట్రాఫిక్ సిగ్నళ్ల అమరిక, పని చేయనివాటి పునరుద్ధరణపై చర్చించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాలను గుర్తించి శాశ్వత పరిష్కారాలు చేపట్టాలని నిర్ణయించారు. పాదచారుల భద్రత కోసం అవసరమైన ప్రాంతాల్లో ఫుట్పాత్ల అభివృద్ధి, మరమ్మతులపై దృష్టి సారించారు. పెండింగ్లో ఉన్న పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని సీఎంసీ కమిషనర్ సృజన అన్నారు. తరచూ ట్రాఫిక్ రద్దీ ఏర్పడే, ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గితే సురక్షిత ప్రయాణం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. వాటర్బోర్డ్ ఎండీ అశోక్రెడ్డి, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి.పాటిల్, టీజీఐఐసీ వీసీ కె.శశాంక, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ట్రాఫిక్) సన్ప్రీత్ సింగ్, ట్రాఫిక్ డీసీపీలు, శాంతిభద్రతల విభాగం డీసీపీలు, సీసీఎంసీ జోనల్ కమిషనర్లు, హైడ్రా, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేస్తేనే ట్రాఫిక్ ఇక్కట్లు తప్పుతాయి
అన్ని విభాగాల సమావేశంలోసైబరాబాద్ సీపీ రమేష్


