తాండూరు టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు త్వరలో అడ్డుకట్ట వేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్ అన్నారు. శుక్రవారం బద్లావ్ జరూరీ హై కార్యక్రమంలో భాగంగా పాత తాండూరు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో ధరలు ఆకాశాన్నంటాయని ఆరోపించారు. సామాన్య ప్రజలకు విద్య, వైద్యం కరువైందన్నారు. పంటలకు కనీస మద్దతు ధర చెల్లించడం లేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త లేబర్ కోడ్లను అమలులోకి తెచ్చి కార్మిక హక్కులను కాలరాయడం, దేశ సంపదను అదానీ, అంబానీలకు దారధత్తం చేయడమే బీజేపీ ఎజెండాగా మారిందన్నారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించి దొంగ చాటున అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. భవిష్యత్లో బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బదలావ్ జరూరీహై పేరుతో జిల్లా వ్యాప్తంగా గ్రామగ్రామాన పాదయాత్రలు నిర్వహించి, ప్రజలను చైతన్యవంతులను చేస్తామని అన్నారు. సెప్టెంబర్ ఒకటిన చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే తదుపరి కర్తవ్యమన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పీర్మహ్మద్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సురేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేశ్, అబ్దుల్లా, రవీందర్, మునీర్, అహ్మద్, రాజు, నరసమ్మ, బాలమ్మ, లక్ష్మి, మాణెమ్మ తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ ఒకటిన చలో ఢిల్లీ కార్యక్రమం
సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్
పాత తాండూరు నుంచి పాదయాత్ర ప్రారంభం


