అనంతగిరి/కుల్కచర్ల: మండలంలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2026 – 27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కుల్కచర్ల గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీకాంత్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రీజినల్ కోఆర్డినేటర్ నాగార్జున్ రావు ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగుతున్నట్లు తెలిపారు. కుల్కచర్ల గురుకుల జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ కెమిస్ట్రీ, గురుకుల పాఠశాలలో పీజీటీ, ఇంగ్లిష్, పీజీటీ ఫిజికల్ సైన్స్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఇంగ్లిష్ మీడియంలో బోధించగల అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 11న రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని మానసా హిల్స్లో ఉన్న రీజనల్ కోఆర్డినేటర్, గిరిజన సంక్షేమ గురుకుల కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు జిరాక్స్ సెట్లతో డెమో మరియు ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.
బొంరాస్పేట: ఉప సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షురాలిగా బొంరాస్పేటకు చెందిన ఉప్పరి నందిని ఎన్నికయ్యారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్నాయక్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉపసర్పంచుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు.


