పూడూరు: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో గ్రామీణ ప్రాంతాల రోడ్లు ఛిద్రమవుతున్నాయి. ఏ మాత్రం ఆదమర్చినా ప్రమాదం బారిన పడకతప్పదని ఇక్కడ చూస్తున్న చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. పూడూరు మండలం చన్గోముల్– మన్నెగూడ ఆర్ఆండ్బీ రహదారి.. కల్వర్టు ప్రాంతంలో రూపం కోల్పోయింది. పూర్తిగా గోతులు ఏర్పడి, నీరు చేరింది. అడుగుతీసి పెట్టలేనంతగా బురద పేరుకుపోయింది. కల్వర్టు వద్ద భారీ గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించాలంటే భయంభయంగా ఉందని పేర్కొంటున్నారు. వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే కల్వర్టు గుంత వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు.. రోడ్డు మరమ్మతుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


