వికారాబాద్లో అభివృద్ధి ఎక్కడుంది?
● శాసన సభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి
● స్పీకర్ ప్రసాద్ కుమార్పై పరోక్ష విమర్శలు
వికారాబాద్: వికారాబాద్ పరిస్థితి చూస్తుంటే స్పీకర్ ప్రసాద్కుమార్ అచేతనత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని శాసనసభ మాజీ స్పీకర్, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, విద్యామౌలిక వనరుల సంస్థ మాజీ చైర్మన్ నాగేందర్గౌడ్తో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వికారాబాద్లో అభివృద్ధి ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదన్నారు. స్పీకర్ పదవి పెద్దదని, తాను కూడా గతంలో పనిచేశానని తెలిపారు. ఆహోదాలో ఉన్న వారు అనుకుంటే తమ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కానీ ప్రస్తుతం వికారాబాద్ను చూస్తుంటే బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి మినహా ఏమీ కనిపించడం లేదన్నారు. గత ప్రభుత్వం వికారాబాద్కు నిధులు కేటాయిస్తే వాటిని కూడా రద్దు చేయించారని ఆరోపించారు. ప్రస్తుత స్పీకర్ను చూస్తుంటే జాలేస్తోందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం రేవంత్రెడ్డితో పాటు ఆయన ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వచ్చాక వికారాబాద్లో ఒక్కరికై నా ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు. ఆయన(ప్రసాద్కుమార్)కు మాత్రం రాష్ట్రంలోనే పెద్ద ఉద్యోగం వచ్చిందని, ఇది చాలదన్నట్లుగా వికారాబాద్ మున్సిపాలిటీని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేయించుకుని, ఆయన కూతురును బరిలో నిలిపారని ఎద్దేవా చేశారు. శుభప్రద్పటేల్ మాట్లాడుతూ.. వికారాబాద్లో సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారని, కొందరు నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోపాల్, వేణుగోపాల్రెడ్డి, రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


