నుమాయిష్‌ నయా లుక్‌..సిద్ధమవుతోన్న ఎగ్జిబిషన్‌

Just Few Days Begin All India Industrial Exhibition In Greater Hyderabad  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఆల్‌ ఇండియా ఇండ్రస్టియల్‌ ఎగ్జిబిషన్‌ (నుమాయిష్‌) ప్రారంభానికి ఇంకా కొద్ది రోజులే ఉంది. గత రెండేళ్లుగా కరోనాతో పూర్తిస్థాయి వైభవానికి దూరమైన ఈ భారీ ప్రదర్శన... ఈసారి రెట్టించిన ఉత్సాహంతో సందర్శకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. కొత్త కొత్త విశేషాలను జోడిస్తున్నామని, సందర్శకుల అనుభూతిని పెంచనున్నామని ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రతినిధులు చెబుతున్నారు.

కోవిడ్‌ మహమ్మారి  సమస్యల కారణంగా షెడ్యూల్‌ ప్రకారం నుమాయిష్‌ నిర్వహించలేకపోయారు. కరోనాకి ముందు 45 రోజుల వ్యవధిలో సుమారు 20 లక్షల మంది ప్రజలు నుమాయిష్‌ను సందర్శించేవారు. వారాంతాల్లో ఒక్క రోజులో హాజరు 40,000 ఉండేది. అయితే కరోనాతో భారీగా పడిపోయిన ఈ సంఖ్యల్ని మళ్లీ తీసుకురావాలని సొసైటీ కృతనిశ్చయంతో ఉంది.  

ఆరంభమే...సంపూర్ణంగా... 
సాధారణంగా నుమాయిష్‌ జనవరి 1న ప్రారంభమైనా, స్టాల్స్‌ మొత్తం ఏర్పాటవడం అంటే అది సంక్రాంతి పండుగ తర్వాతే జరుగుతుంది. అయితే ఈసారి అలా కాకుండా తొలి రోజు నుంచే పూర్తిగా లేదా కనీసం 80 శాతం స్టాల్‌ యజమానులు తమ వ్యాపార కార్యకలాపాలను  ప్రారంభించేలా చూడాలని ఎగ్జిబిషన్‌ సొసైటీ తమ లక్ష్యంగా పెట్టుకుంది. ‘సందర్శకులకు, స్టాల్‌ యజమానులకు ఉభయకుశలోపరిగా ఉండేందుకు అధికారిక ప్రారంభోత్సవం నుంచే పూర్తిస్థాయిలో స్టాల్స్‌ ఏర్పాటయేలా ప్రయత్నిస్తున్నాం,’అని ఎగ్జిబిషన్‌ సొసైటీ వైస్‌ ప్రెసిడెంట్‌ అశి్వన్‌ మార్గం అన్నారు. 

ప్రారంభమైన స్టాల్స్‌ కేటాయింపు.. 
నుమాయిష్‌లో 10/12 విస్తీర్ణంలో స్టాల్స్‌ నిర్మాణం వేగంగా సాగుతోంది. భద్రతా కారణాలు, అగ్నిమాపక నిరోధక నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేస్తున్న  కారణంగా అత్యవసర వాహనాలు వెళ్లేందుకు ఎక్కువ స్థలాన్ని అనుమతించడం వల్ల ఈ సారి స్టాళ్ల సంఖ్య కొంత తగ్గనుంది. గత సోమవారం నుంచి స్టాళ్ల యజమానులకు సొసైటీ  కేటాయింపు లేఖలు అందజేయనుంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా 2,000 మంది వ్యాపారుల నుంచి దరఖాస్తులు రాగా, 1,200 స్టాల్స్‌ను కేటాయించనున్నారు. గత ఏడాది కొందరు జీఎస్టీ కట్టకుండా వెళ్లిపోయిన దృష్ట్యా   ఈ దఫా స్టాల్స్‌కి జీఎస్టీతో కలిపి రూ.10 వేల చొప్పున అదనంగా కేటాయింపు పెంచారు.  తెలంగాణ ఉత్పత్తులు పెడతామని రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎమ్‌ఇ)ల నుంచి  50స్టాల్స్‌ కోసం వినతి రావడంతో వాళ్ల కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తున్నామన్నారు.  

సందర్శన వేళలు పెంపు... 
వీకెండ్స్‌లో రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో కనీసం రాత్రి 11.30 గంటల వరకు ఎగ్జిబిషన్‌ను అనుమతించాలని సొసైటీ సంబంధిత అధికారులను కోరనుంది. ‘నగరమంతటా అర్ధరాత్రి వరకు మార్కెట్లు తెరిచి ఉంటాయి. కాబట్టి ఎగ్జిబిషన్‌ కూడా రాత్రి 10.30 గంటల నుంచి మరో గంట సమయం అధికంగా సడలింపును కోరుతున్నాము, తద్వారా  రద్దీ తగ్గి, సందర్శకులు ఇక్కడ షాపింగ్‌ చేయడానికి  విశ్రాంతి తీసుకోవడానికి తగినంత వ్యవధి లభిస్తుంది’అని అశ్విన్‌ చెప్పారు. సందర్శకులకు ఉచిత ‘వైఫై’ సౌకర్యాన్ని అందించడానికి కూడా ప్లాన్‌ చేస్తున్నాం్ఙ అని అన్నారాయన.  

ఈ సారి స్ట్రీట్‌ లైట్స్‌ వగైరాలతో మరింత సుందరంగా తయారు చేస్తున్నాం. అలాగే ఎంత రష్‌ ఉన్నా ఫ్రీ మూమెంట్‌ ఉంటుంది. తోసుకోవడం వంటివి ఉండదు. ఒకప్పుడు కార్నర్‌ స్టాల్స్‌ వరకూ వెళ్లగలిగేవారు కాదు. ఇప్పుడలా కాదు..ప్రతీ స్టాల్‌ మెయిన్‌ స్టాల్‌ తరహాలో కనిపిస్తుంది. అదే విధంగా గతంతో పోలిస్తే పాత్‌ వే 15 అడుగుల వరకూ పెంచాం. ‘వీటన్నింటి దృష్ట్యా నాలుగేళ్ల తర్వాత నుమాయిష్‌ ప్రవేశ రుసుమును రూ. ఒక్కొక్కరికి 40కి పెంచుతున్నాం’ అని అశ్విన్‌ మార్గం చెప్పారు.   

(చదవండి: ఆకాశ వీధి నుంచి.. అందాల వీక్షణం )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top