తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్): శ్రీకాళహస్తి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అటవీశాఖ అధికారులు ముందస్తు సమాచారం మేరకు శుక్రవారం దాడులు నిర్వహించి 40 ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ అధికారి లోకేష్ మాట్లాడుతూ.. అక్రమంగా తరలించేందుకు సిద్ధంచేసిన 40 దుంగలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వాటి బరువు 350 నుంచి 400 కిలోలు, వాటి విలువ రూ.1.5 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
ఎస్వీయూ వీసీకి అరుదైన గౌరవం
తిరుపతి సిటీ: ప్రముఖ అంతర్జాతీయ సైంటిస్ట్, ఎస్వీయూ వీసీ టాటా నరసింగరావుకు అరుదైన గౌరవ లభించింది. భారత జాతీయ సైన్స్ అకాడమీ ఆఫ్ సైన్స్ సంస్థ ఫెలో ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ హోదాకు ఎంపికచేశారు. భారతదేశంలో ప్రసిద్ధి చెంది, 1930లో స్థాపించబడిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 2026, డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్న 96వ సంవత్సరిక సదస్సులో దీనిని అందజేయనున్నట్లు అకాడమీ ప్రకటించింది. దేశంలో ఇలాంటి ఫెలోషిప్ హోదా పొందిన కొద్ది మంది సైంటిస్టుల జాబితాలో వర్సిటీ ఉపకులపతి ఆచార్య టాటా నరసింగరావు చేరడం పట్ల పలువురు వర్సిటీ అధికారులు, అధ్యాపకులు హర్షం వ్యక్తంచేశారు.


