శ్రీకాళహస్తి రూరల్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రతి పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్. కుమార్ అన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు తగిన అవగాహన కల్పిస్తూ, ఆయా సబ్జెక్టుల్లో మెరుగైన మార్కులు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మంగళవారం శ్రీకాళహస్తి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సబ్జెక్టుల వారీగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వరదయ్యపాలెం, బీఎన్కండ్రిగ, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, కె.వి.బి.పురం మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు పదవ తరగతి విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించేందుకు అనుసరించాల్సిన మెలకువలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బ్లూప్రింట్, మిషన్ మార్చి–2027 తదితర అంశాలపై సబ్జెక్టు నిపుణులు ఉపాధ్యాయులకు వివరణాత్మకంగా శిక్షణ ఇచ్చారు.
విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎంఈవో బాలయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల వెంకటయ్య, విషయం నిపుణులు యువశ్రీ మురళి, మూర్తి, మునీశ్వరరెడ్డి, రవి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


