తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి వేదికగా నిర్వహిస్తున్న అమరావతి చాంపియన్షిప్–2026 జిల్లా స్థాయి క్రీడా పోటీలు మూడవ రోజు రసవత్తరంగా సాగాయి. ఇందులో భాగంగా మంగళవారం అండర్–17, అండర్–23 బాలబాలికల విభాగాల్లో బాక్సింగ్, చెస్, హాకీ పోటీలను నిర్వహించారు. ఇందులో భాగంగా చివరి రోజైన బుధవారం ఎస్వీయూ మైదానంలో ఖోఖో, కబడ్డీ, యోగా పోటీలను శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఆర్చరీ పోటీలను ఎస్వీయూ క్యాంపస్ స్కూల్లో నిర్వహించనున్నారు.
ఆర్థోపెడిక్ వైద్యంలో అపోలో మైలురాయి
తిరుపతి తుడా: ఆర్థోపెడిక్ వైద్యరంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ముందుకు సాగుతున్న చైన్నె అపోలో హాస్పిటల్స్ విజయవంతంగా 2వేల రోబోటిక్ సహాయక జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలను పూర్తి చేసి కీలక మైలురాయిని చేరుకుందని అపోలో మెయిన్ ఆస్పత్రి క్లినికల్ లీడ్ హెడ్ డాక్టర్ విజయ్కిషోర్ కొండ్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసుపత్రి బృందం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోగి శరీర నిర్మాణానికి అనుగుణంగా వ్యక్తిగత శస్త్రచికిత్స ప్రణాళిక రూపొందించి స్వల్పకాలంలో 2 వేల రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడం గర్వకారణమని తెలిపారు. రోగులు తిరుపతి తుడా రోడ్డులోని తమ అపోలో సమాచార కేంద్రాన్ని సంపద్రించి మెరుగైన కచ్చితమైన వైద్య చికిత్స పొందాలని ఆయన సూచించారు.
నేటి నుంచి మెరిట్ విద్యార్థుల జాబితా
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి జిల్లాలో జాతీయ ఉపకార వేతన పరీక్ష(ఎన్ఎంఎంఎస్)లో మెరిట్ ప్రాతిపదికన ఎంపికై న విద్యార్థుల జాబిత ఈ నెల 12వ తేదీ నుంచి ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్’ వెబ్సైట్లో తమ పేర్లను పరిశీలించుకోవాలని సూచించారు. ఉపకార వేతనం పొందేందుకు విద్యార్థి పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా వివరాలను ఆధారుతో అనుసంధానం చేసి, డీబీటీ ద్వారా నగదు బదిలీ అయ్యేలా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అలాగే ఎన్ఎంఎంఎస్కు ఎంపికై న విద్యార్థులు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్సీహెచ్ఓఎల్ఏఆర్ఎస్హెచ్ఐపీఎస్.జీఓవీ.ఇన్’ వెబ్సైట్లో అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని, విద్యార్థుల వివరాల్లో సవరణలు అవసరమైన సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాలల్లో ఎన్ఎంఎంఎస్కు ఎంపికై న విద్యార్థుల వివరాలను పరిశీలించి, వారికి బ్యాంకు ఖాతా, ఆధార్ సీడింగ్, డీబీటీ తదితర అంశాలపై అవగాహన కల్పించి, ఉపకార వేతనం పొందే ప్రక్రియను సక్రమంగా పూర్తి చేయించాలని డీఈఓ సూచించారు.


