తిరుపతి అర్బన్ : ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు కదం తొక్కారు. కలెక్టరేట్ ఎదుట శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి వందల మంది కార్మికులు తరలివచ్చారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలో ఉంటే మరోమాట చెప్పడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. న్యాయమైన కోర్కెలు తీర్చకుంటే వచ్చే ఎన్నికల్లో కూటమికి భంగపాటు తప్పదని హెచ్చరించారు. నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వనచేతన యాప్తో నానా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వందాసి నాగరాజు మాట్లాడుతూ చంద్రబాబు విజనరీ అంటూ అంగన్వాడీలతోపాటు ఆశా కార్మికులు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేస్తున్న కార్మికులు, ఏఓఏ, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ తదితర అన్ని వర్గాలకు చెందిన వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగ సంఘాల నేతలు వాణిశ్రీ, కవిత, విజయమ్మ, సునీత, పద్మలీలా, స్వరూపరాణి, రాజేశ్వరి, ధనమ్మ, మునికుమారి, హైమావతి, నిర్మలమ్మ పాల్గొన్నారు.


