● ఆగస్ట్ 22 నుంచి 29 వరకు రాత పరీక్షలు
తిరుపతి రూరల్ : ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల దరఖాస్తులను సోమవారంతో గడువు పూర్తవుతుందని ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆగస్ట్ 22 నుంచి 29వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ షెడ్యూల్ తేదీల్లో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. నియామక ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని తెలిపారు. వివరాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. దళారుల మాటలు, సామాజిక మాధ్యమాల ద్వారా వెలువడే సమాచారం నమ్మవద్దని కోరారు.
నేడు ‘డయల్ యువర్ సీఎండీ’
తిరుపతి రూరల్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ నిర్వహించనున్నట్లు ఎస్పీడీసీఎల్ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తిరుపతి, చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు 8977716661 నంబర్కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చని వివరించారు. ఫోన్ చేసిన సమయంలో వినియోగదారులు తమ విద్యుత్ సర్వీస్ నంబర్ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
ఆలస్యంగా నడిచిన రైళ్లు
దొరవారిసత్రం : సాంకేతిక సమస్యల కారణంగా ఆదివారం పలు రైల్లు ఆలస్యంగా నడిచాయి. దొరవారిసత్రం రైల్వేస్టేషన్కు సమీపంలో డౌన్లైన్ పట్టాలపై సిగ్నల్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఏర్పడడంతో చైన్నెఽ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు సుమారు అరగంట ఆలస్యంగా నడిచినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. తొలుత చైన్నె నుంచి నెల్లూరుకు వెళ్లే మెమో రైలు 97 కిలోమీటర్ వద్ద ఆగిపోయింది. అలాగే మధురై నుంచి నిజాముద్దీన్కు వెళ్లే నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ 96 కిలోమీటర్ వద్ద నిలిచిపోయింది. చైన్నె నుంచి అహ్మదాబాద్కు వెళ్లే నవజీవన్ ఎక్స్ప్రెస్ 94 కిలోమీటర్ వద్ద ఆగిపోయింది. రైల్వే సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.
నేటి నుంచి దస్తావేజు లేఖర్ల సమ్మె
ప్రశ్నార్థకంగా రిజిస్ట్రేషన్లు
తిరుపతి అర్బన్ : రిజిస్ట్రేషన్ కార్యాలయాల పగ్గాలను ఈ నెలాఖరు నుంచి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నారు. దీని జిల్లాలోని దస్తావేజు లేఖర్లు మండిపడుతున్నారు. దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వైఖరి కారణంగా తమ ఉపాధికి గండి పడుతుందని వాపోతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తమను భాగస్వాములను చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని 17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తులకు సంబందించి రిజి స్ట్రేషన్ల ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారనుంది.


