తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ, పద్మావతి మహిళా జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియను ఆరు విడతల్లో సాగదీసిన అధికారులు ఎట్టకేలకు దిగివచ్చి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఆఫ్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించి మిగిలిన సీట్ల భర్తీ ప్రక్రియను ఈనెల 23, 24 తేదీలలో నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో గత నెల రోజులుగా కళాశాలల్లో సీట్ల కోసం సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసాలకోర్చి కళాశాల చుట్టూ, రాజకీయ నాయకుల ఇళ్ల వద్ద పడిగాపులు కాసిన విద్యార్థుల తల్లిదండ్రులకు కాస్త ఊరట లభించినట్టయ్యింది.
ఆన్లైన్లో దరఖాస్తు
చేసుకున్న వారికి మాత్రమే
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే స్పాట్ అడ్మిషన్లకు అర్హులని, దరఖాస్తు చేయనివారు అనర్హులని అధికారులు స్పష్టం చేశారు. స్పాట్ అడ్మిషన్లకు టీటీడీ ఉద్యోగుల పిల్లలు, టీటీడీ ఎస్వీ బాలమందిర్ విద్యార్థులు, మొదటి నుంచి ఆరో దశ కౌన్సెలింగ్ వరకు హాజరు కాలేకపోయిన అభ్యర్థులు, తిరుపతి స్థానికులు, స్థానికేతర అభ్యర్థులు హాజరుకావచ్చని సూచించారు.
ఎస్వీ జూనియర్ కళాశాల
కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా...
23వ తేదీన ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు 550 నుంచి 600 మధ్య మార్కులు సాధించిన అభ్యర్థులు స్పాట్కు హాజరుకావాలని, అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 500 నుంచి 549 మధ్య మార్కులు సాధించిన అభ్యర్థులకు ఆఫ్లైన్ కౌన్సెలింగ్ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఈనెల 24న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు 450 నుంచి 499 మార్కులు సాధించిన అభ్యర్థులకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6గంటల వరకు 400 నుంచి 449 మార్కులు సాధించిన అభ్యర్థులు హాజరుకావచ్చని ప్రకటించారు. అర్హులైన విద్యార్థులు అవసరమైన ఒరిజినల్ ధృవపత్రాలతో హాజరు కావాలని పేర్కొన్నారు.


