తిరుమలలో మాక్ డ్రిల్
తిరుమల: కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రదాడి నేపథ్యంలో ముంద జాగ్రత్తగా తిరుమలలో ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను లేపాక్షి సర్కిల్ వద్ద ఉన్న సుదర్శరన్ సత్రంలో గురువారం సాయంత్రం భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. అదనపు ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా, భద్రతా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు. అసాల్ట్ డాగ్ ఎనిమీ ఎటాక్, రూమ్ ఇన్టర్వెన్షన్ కార్యకలాపాలు చేసి చూపారు. దాదాపు ఒకటిన్నర గంటపాటు ఈ మాక్ డ్రిల్ కొనసాగింది. ఈ మాక్ డ్రిల్లో 28 మంది ఆక్టోపస్ కమాండోలు, 25 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, 15 మంది పోలీసులు, 10 ఏపీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో వీజీవోలు రామ్కుమార్, సురేంద్ర, డీఎస్పీ విజయశేఖర్ పాల్గొన్నారు.
అలిపిరిలో ముమ్మర తనిఖీలు
అలిపిరి వద్ద హైఅలెర్ట్ ప్రకటించారు. తిరుమలకొచ్చిపోయే ప్రతి వాహనాన్నీ తనిఖీ చేశారు. రెండు ఘాట్ రోడ్లలో డాగ్స్ స్క్వాడ్ బాంబు స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. తిరుమలకి వెళ్లే సమయంలో లింకు రోడ్డు వద్ద కూడా పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు కొద్దిరోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు.
తిరుమలలో మాక్ డ్రిల్


