సమగ్ర విచారణను ఇప్పటికే పూర్తి చేశాం
కిరణ్, అర్జున్రెడ్డి సందేశాలపై దర్యాప్తు చేశాం
సీఎఫ్ఎస్ఎల్ నిపుణుడి అభిప్రాయం రికార్డు చేశాం
ఈ విషయంలో సునీత పిటిషన్కు విచారణార్హత లేదు
వివిధ కోర్టుల్లో ఆమె పిటిషన్లతో విచారణ ఆలస్యమవుతోంది
అభియోగాల ఖరారు కూడా వాయిదా పడుతోంది
కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేయాలి
ప్రత్యేక కోర్టుకు సీబీఐ వినతి.. ఈ మేరకు కౌంటర్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు ఆదేశాల మేరకు న్యాయ విచారణను ఆలస్యం చేస్తూ.. దానిని నిరంతరం కొనసాగించాలని దుర్బుద్ధితో సునీత వేస్తున్న పిటిషన్లకు సీబీఐ అడ్డుకట్ట వేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం లేదని, ఇప్పటికే సమగ్ర విచారణ పూర్తి చేశామని సీబీఐ ప్రత్యేక కోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ సవివరమైన కౌంటర్ దాఖలు చేసింది. ఆమె పిటిషన్ చట్టవిరుద్ధమని పేర్కొంటూ దీనిని కొట్టివేసి న్యాయ విచారణను వేగవంతంగా పూర్తి చేయాలని కోరింది. కిరణ్యాదవ్, అర్జున్రెడ్డి సందేశాలపై ఆమె చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొంది.
వారి సందేశాలపై కోర్టు ఆదేశాల మేరకు మరోసారి దర్యాప్తు చేశామని, ఫోరెన్సిక్ నిపుణుడి అభిప్రాయం కూడా తీసుకున్నామని తెలిపింది. ఇష్టారాజ్యంగా సునీత పిటిషన్లు వేస్తుండటంతో విచారణ ఆలస్యమవుతోందని, అభియోగాల ఖరారు వాయిదా పడుతోందని పేర్కొంది. ఇలా ఏళ్లు గడుస్తు పోతుంటే.. విచారణపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. వివేకా హత్య కేసులో నర్రెడ్డి సునీత దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్పై ప్రత్యక కోర్టు న్యాయమూర్తి డాక్టర్ పట్టాభి రామారావు శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సీబీఐ సమగ్ర లిఖితపూర్వక వాదనలు సమర్పించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
అర్ధరాత్రి సందేశాల మార్పిడి ఆరోపణ పూర్తిగా తప్పు..
చట్టపరంగా సునీత పిటిషన్కు విచారణార్హతే లేదు. కోర్టు ఆదేశాల మేరకు పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, ఇప్పటికే మూడో సప్లిమెంటరీ ఫైనల్ రిపోర్ట్ను సమర్పించాం. కేసు ప్రస్తుతం ట్రయల్ దశలో ఉంది. ఈ సమయంలో దర్యాప్తు సరైన విధంగా జరగలేదని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేయడం సముచితం కాదు. సునీత ప్రధానంగా ప్రస్తావించిన అంశం కిరణ్యాదవ్, అర్జున్రెడ్డి మధ్య జరిగిన సందేశాల మార్పిడి. 2019, మార్చి 15 అర్ధరాత్రి 1:42 సమయంలో కిరణ్యాదవ్ మొబైల్ నంబర్ నుంచి అర్జున్రెడ్డి నంబర్కు రెండు సందేశాలు వెళ్లాయని, అవి హత్య కుట్రలో కీలక ఆధారాలన్నది పిటిషనర్ వాదన. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపాం.
దర్యాప్తులో భాగంగా కిరణ్యాదవ్, అర్జున్రెడ్డిని విచారించాం. ఆ సందేశాలు హత్య జరిగిన రాత్రి కాకుండా అదే రోజు ఉదయం పంపినవని వారు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన సీఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్) నిపుణుడి అభిప్రాయాన్ని కూడా రికార్డు చేశాం. మొబైల్ ఎక్స్ట్రాక్షన్ రిపోర్ట్లో కనిపించిన సమయం యూటీసీ ఫార్మాట్లో ఉండటంతో, దానిని భారత కాలమానం (ఐఎస్టీ)కు మార్చేందుకు 5 గంటల 30 నిమిషాలు కలపాల్సి వస్తుందని నిపుణుడు వివరించారు.
దీంతో రాత్రి 1:42గా కనిపించిన సందేశాలు వాస్తవానికి ఉదయం 7:12 గంటల సమయంలో పంపినవని తేలింది. కాల్ డేటా రికార్డులు (సీఆర్డీ) కూడా ఇదే విషయాన్ని నిర్ధారించాయి. కిరణ్ యాదవ్ మొబైల్ నుంచి ఉదయం 7:12:01, 7:12:30 గంటలకు సందేశాలు పంపినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. అర్ధరాత్రి సందేశాల మార్పిడి జరిగిందన్న ఆరోపణ పూర్తిగా తప్పని స్పష్టమైంది. ఈ విశ్లేషణతో హత్య జరిగిన రాత్రి సందేశాల మార్పిడి ఆధారంగా కుట్ర ఆరోపణ సత్యదూరం.
ఆమె పిటిషన్లు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం
పిటిషనర్ వరుసగా వివిధ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తుండటంతో కేసు విచారణ ఆలస్యమవుతోంది. ఇప్పటికే ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో కూడా క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాల ప్రకారం.. సప్లిమెంటరీ చార్జ్షిట్ దాఖలు తర్వాత ట్రయల్ వేగంగా కొనసాగాల్సి ఉంది. తరచూ ఆమె కొత్త పిటిషన్లు దాఖలు వేస్తుండడంతో అభియోగాల ఖరారు (ఫ్రేమింగ్ ఆఫ్ చార్జిస్) కూడా ఆలస్యమవుతోంది.
కాలం గడిచే కొద్దీ కీలక సాక్షులను సమర్థవంతంగా కోర్టులో హాజరు పరచడం, సాక్ష్యాలను సురక్షితంగా ఉంచడం కష్టతరమవుతుంది. ఆలస్యంతో విచారణపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే సెక్షన్ 173 (8) సీఆర్పీసీ కింద సప్లిమెంటరీ ఫైనల్ రిపోర్ట్ సమర్పించాం. కోర్టు కాగి్నజెన్స్(ఆమోదం) కూడా తీసుకుంది. సునీత దాఖలు చేసిన పిటిషన్ చట్టపరంగా నిలబడదు.. దాన్ని కొట్టివేయాలి.


