నల్లగొండ జిల్లా పట్టణ కేంద్రంలోని జేబీ కాలనీలో వారం రోజుల క్రితం జరిగిన కల్లు రూపా రెడ్డి హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. హంతకుడు పదో తరగతి చదువుతున్న వంశీగా గుర్తించారు. ఇతడికి మరో వ్యక్తి సాయం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే హత్య ఎందుకు చేశారనే కారణాలు తెలియాల్సి ఉంది.
మృతురాలు కల్లు రూపారెడ్డి.. నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్. ఈమె తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఒంటిపై కత్తిపోట్లు కనిపించాయి. హంతకుడు గ్లౌజులు ధరించి ఈ దారుణానికి పాల్పడటంతో ఘటనా స్థలంలో ఎలాంటి ఆనవాళ్లూ లభించలేదు. దీంతో ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది. లభ్యమైన సీసీ ఫుటేజీల ఆధారంగా హత్య చేసిన నిందితుడి వయసు 20 నుంచి 25 ఏళ్లు ఉండొచ్చని పోలీసులు తొలుత అంచనా వేశారు. పాఠశాల సిబ్బందిని, కాలనీ వాసులు, కుటుంబ సభ్యులను విచారించారు.
సీసీ ఫుటేజీలని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. గత శనివారం ప్రత్యేక నిఘా విభాగానికి (స్పెషల్ బ్రాంచ్) చెందిన పోలీసులు సైతం రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. అలా ఇప్పుడు ఎట్టకేలకు నిందుతుల్ని కనిపెట్టారు.


