అజాన్ (ఫైల్)
హైదరాబాద్, బహదుర్పురా: ‘మా ఇంటికి ఎందుకు వచ్చారు.. వెళ్లిపోండి’ అన్నందుకు బాలుడు దారుణ హత్యకు గురైన ఘటన కాలాపత్తర్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ మహ్మద్ కలీల్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలాపత్తర్ బిర్యానీ షా టెకిడీకి చెందిన మహ్మద్ ఫైజ్ ఎలియస్ అజాన్ (17) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.
ఐదేళ్ల క్రితం కాలాపత్తర్లో ఉన్న అబ్రార్ ప్రస్తుతం బాలాపూర్లో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి అబ్రార్ తన స్నేహితులు ఆశ్వక్ (21), పర్హాన్ (20) సహా మరో ఇద్దరితో కలిసి మద్యం తాగారు. అబ్రార్ ఆదివారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఆశ్వక్, పర్హాన్లను వెంటబెట్టుకుని కాలాపత్తర్ బిర్యానీ షా టెకిడీలోని అజాన్ ఇంటి వద్దకు వచ్చాడు. ఇక్కడికి ఎందుకొచ్చారంటూ అజాన్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వారిని అడ్డుకున్నారు.
ఈ క్రమంలో వీరి మధ్య వాగ్వాదం జరిగి ఆశ్వక్, పర్హాన్, అబ్రార్ కలిసి తలపై కత్తితో పొడవడంతో అజాన్ కుప్పకూలాడు. అతను మృతి చెందినట్లు తెలుసుకున్న అబ్రార్ తన స్నేహితులతో కలిసి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అజాన్ మామ సాధిక్ అలీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల కారణంగా అజాన్ను హత్య చేశారా? లేక పథకం ప్రకారం జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు మూడు టీంలు రంగంలోకి దిగాయి.


