హైదరాబాద్, పహాడీషరీఫ్: పాతబస్తీ మీర్చౌక్లో అదృశ్యమైన ఓ యువకుడు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో శవమై కనిపించిన సంఘటన బుధవారం వెలుగుజూసింది. హిజ్రాల చేతిలో హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్చౌక్ ప్రాంతానికి చెందిన ఫిర్దోస్ ఖాన్ రెండో కుమారుడు ఒవేజ్ఖాన్(26) ఖాళీగా ఇంటి వద్దే ఉంటున్నాడు.
ఇతనికి కొంతకాలంగా హిజ్రాలతో సంబంధాలున్నాయి. గత నెల 27వ తేదీన రాత్రి 11 గంటలకు అనారోగ్యంతో ఉన్న తండ్రిని ద్విచక్ర వాహనంపై స్థానిక దుర్రు షెహవర్ ఆసుపత్రి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా గాలించినా ఫలితం లేకుండా పోయింది. 28వ తేదీన రాత్రి సర్దార్నగర్ షీప్ మండి సమీపంలో అతని బైక్ లభ్యమైంది. ఈ విషయమై ఫిర్దోస్ఖాన్ మీర్చౌక్ పోలీస్స్టేషన్లో 29వ తేదీన ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం బైక్ లభ్యమైన షీప్ మండి సమీపంలో ఒవేజ్ఖాన్ మృతదేహం ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ బీఎల్ఎన్ రెడ్డి కుటుంబ సభ్యులను రప్పించి పరిశీలించగా ఒవేజ్ఖాన్ మృతదేహంగా తేలింది. గాయాలు గుర్తించలేని స్థితిలో మృతదేహం కుళ్లిపోయి కనిపించింది. దివ్యాన్షి, కరిష్మాతో పాటు మరికొందరు హిజ్రాలు అతన్ని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


