కాచుకొని.. కాపాడుతారు | Yamcha villagers in Telangana have saved over 450 lives in 5 years | Sakshi
Sakshi News home page

కాచుకొని.. కాపాడుతారు

Jun 30 2025 5:38 AM | Updated on Jun 30 2025 5:38 AM

Yamcha villagers in Telangana have saved over 450 lives in 5 years

వంతెనపై నుంచి నదిలో దూకిన వారిని కాపాడిన మత్స్యకారుడు శ్రీకాంత్‌ (ఫైల్‌)

బాసర గోదావరి వంతెనపై ఆపద్బాంధవులు 

ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వారిని రక్షిస్తున్న యంచ యువకులు

ఐదేళ్లలో 450 మందిని కాపాడిన గ్రామస్తులు

బోధన్‌: బతకడానికి ఏ దారీ లేనప్పుడు గోదారే దిక్కు అని.. ప్రాణాలు తీసుకోవటానికి సిద్ధపడేవారికి ఆ గ్రామ యువకులు బతుకుపై ఆశలు కలిగిస్తున్నారు. చావుకు, బతుక్కు మధ్యలో నిలిచి ఎంతో మంది ప్రాణాలు నిలబెడుతున్నారు. వారే నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం యంచ గ్రామ యువత. యంచ గ్రామం గోదావరి నది ఒడ్డునే ఉంటుంది. అక్కడికి కిలోమీటర్‌ దూరంలో నది నిజామాబాద్, నిర్మల్‌ జిల్లాలను వేరు చేస్తుంది. నదికి ఇటువైపు నిర్మల్‌ జిల్లా బాసర ఆలయం ఉంది. ఈ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రోడ్డు వంతెన కొంతకాలంగా ఆత్మహత్యలు, ఆత్మహత్యా యత్నాలకు కేంద్ర బిందువుగా మారింది.

అక్కడే యంచ గ్రామ యువకులు నిత్యం కాపుకాసి ఎందరినో రక్షిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గత ఐదేళ్లలో వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన సుమారు 450 మందిని రక్షించారు. ఇందులో మత్య్సకారులు కీలకపాత్ర పోషిస్తున్నారు. యంచ గ్రామ యువకులు ప్రవీణ్, వినోద్, మహిపాల్, భూంరాజ్, క్రిష్ణ, యోగేష్, ప్రణయ్, ప్రణీత్, లింగన్న, భోజన్న, ప్రశాంత్, శ్రీకాంత్, బాబు, బేగరి సాయిలు, విజయ్, కిషోర్, రామక్రిష్ణ, నగేష్, సాయి శంకర్, సాయిబాబా ఒక్కొక్కరు పదుల సంఖ్యలో ప్రాణాలు కాపాడారు.  

వాట్సాప్‌ గ్రూప్‌లో ఏకమై.. 
యంచ గ్రామంతోపాటు సమీపంలోని అల్జాపూర్‌ యువకులు గ్రామ పంచాయతీ (జీపీ) పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటుచేసుకున్నారు. నది వంతెన దాటి బాసర ప్రాంతంలో వ్యవసాయ పనుల కోసం యంచ గ్రామ రైతులు వెళ్లి వస్తుంటారు. వంతెనపై ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే వాట్సాప్‌ గ్రూప్‌లో సమాచారం చేరవేస్తారు. దీంతో గ్రామంలో ఎవరు అందుబాటులో ఉన్నా వెంటనే వంతెన వద్దకు చేరుకుంటారు. ఆత్మహత్యా ప్రయత్నం చేసేవారితో మాట్లాడి, మనసు మార్చి.. నవీపేట, బాసర పోలీసుల సహకారంతో వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.

బలవన్మరణాలు వేదన కలిగిస్తున్నాయి 
పురాతన ఆలయాలతో పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న మా ఊరు తీరాన బలవన్మరణాలు వేదన కలిగిస్తున్నాయి. గోదావరి వంతెన వద్ద ఆత్మహత్యలను ఆపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. వంతెన మీద ఇనుప కంచెను, సీసీ కెమెరాలు, పోలీస్‌ చెక్‌పోస్టు ఏర్పాటు చేయాలి. నేను 50 మంది ప్రాణాలు కాపాడాను.  – ప్రవీణ్, యంచ మాజీ సర్పంచ్‌ భర్త

25 మంది ప్రాణాలు కాపాడాను
నాలుగేళ్లలో వంతెనపై నుంచి నదిలో దూకేందుకు వచి్చన 25 మందికి పైగా వ్యక్తులను అడ్డుకుని ప్రాణాలు రక్షించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించాను.  – మహిపాల్‌ యంచ గ్రామ యువకుడు

నిత్యం కనిపెడుతుంటాను
నిత్యం వంతెన మీదుగా బాసర ట్రిపుల్‌ ఐటీకి విధుల కోసం రాకపోకలు సాగించే సమయంలో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను కనిపెడుతుంటాను. రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి ముగ్గురు పిల్లలతో వంతెన పై నుంచి దూకేందుకు రాగా వారిని అడ్డుకుని తిరిగి పంపించాను. – ప్రణీత్, యంచ గ్రామం, బాసర ట్రిపుల్‌ ఐటీ ఉద్యోగి

నదిలో మునిగి పోతున్నవారిని బయటకు తెచ్చాం 
– సుమన్, శ్రీకాంత్, భోజన్న, సురేష్, లింగం యంచ గ్రామ మత్స్యకారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement