మహేశ్వరీ జాడ ఎక్కడ? | Woman Missing 23 Days Children Await Mother Case | Sakshi
Sakshi News home page

మహేశ్వరీ జాడ ఎక్కడ?

Jul 2 2026 11:13 AM | Updated on Jul 2 2026 11:21 AM

Woman Missing 23 Days Children Await Mother Case

వికారాబాద్‌: కూలి పనికి వెళ్లిన తల్లి తిరిగి వస్తుందని ఆశగా ఇంటి గుమ్మం వద్ద ఇద్దరు చిన్నారుల నిరీక్షణ రోజురోజుకూ ఆవేదనగా మారుతోంది. జీవన్గీ గ్రామానికి చెందిన ఎనుముల మహేశ్వరి(35) జూన్‌ 8వ తేదీ అదృశ్యమై నేటికి 23 రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. మొబైల్‌ ఫోన్‌ మరో వ్యక్తి వద్ద లభించడం, రైల్వే స్టేషన్ల సీసీ ఫుటేజీల్లో స్పష్టమైన ఆధారాలు దొరకకపోవడం దర్యాప్తు ఆలస్యమవుతోంది. మండలంలోని జీవన్గీకి చెందిన ఎనుముల మహేశ్వరి భర్త అంజిలప్ప మరణానంతరం తన ఇద్దరు కుమార్తెలు అలకనంద(10), భువనేశ్వరి(12)ని పోషిస్తూ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కారి్మకురాలిగా నెట్టుకొస్తోంది. 

జూన్‌ 8న వికారాబాద్‌కు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.     కాల్‌ డేటా రికార్డులు, మొబైల్‌ లొకేషన్‌ ఆధారంగా మహేశ్వరి చివరిసారిగా వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వికారాబాద్, శంకర్‌పల్లి, లింగంపల్లి రైల్వే స్టేషన్ల సీసీ ఫుటేజీలను ప్రత్యేక బృందం పరిశీలించినప్పటికీ ఆమె ఎటు వెళ్లింది, ఎవరితో వెళ్లింది అనే విషయాల్లో స్పష్టత లభించలేదు. 

దర్యాప్తులో కీలకంగా మారిన మహేశ్వరి మొబైల్‌ ఫోన్‌ బెంజిమెన్‌ అనే వ్యక్తి వద్ద లభించడంతో అతడిని పోలీసులు విచారించారు. వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఫోన్‌ దొరికిందని, అక్కడ ముగ్గురు వ్యక్తులు ఓ మహిళను బలవంతంగా తీసుకెళ్తున్నట్లు చూసినట్లు అతడు చెప్పినట్టు సమాచారం. అయితే ఈ కేసుతో అతడికి ప్రత్యక్ష సంబంధం లేదని నిర్ధారణ కావడంతో ఐదు రోజుల క్రితమే విడుదల చేశారు. ప్రస్తుతం కాల్‌ డేటా, సీసీ ఫుటేజీలు, ప్రయాణికుల వివరాలు, రైల్వే మార్గాల్లో కదలికలు, ఇతర ఆధారాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని తాండూరు రూరల్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.  

అమ్మా ఎప్పుడోస్తది..? 
ఇదిలా ఉండగా, ‘‘మా అమ్మ ఎప్పుడొస్తది’’ అంటూ ప్రతిరోజూ అడుగుతున్న ఇద్దరు చిన్నారుల పరిస్థితి గ్రామస్థులను కలచివేస్తోంది. మహేశ్వరి ఆచూకీని త్వరగా కనుగొని కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు, మహిళా సంఘాల ప్రతినిధులు పోలీసులను కోరుతున్నారు. 23 రోజులు గడిచినా ఆమె జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. మరోవైపు ఈ కేసులో దొరికిన బెంజిమెన్‌ను పోలీసులు వదిలిపెట్టడంపై ఆమె అన్న ఎనుముల ఈరప్ప అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసును సీరియస్‌గా దర్యాప్తు చేస్తలేరని ఆరోపిస్తున్నాడు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement