TSRTC: ఆధార్‌ విషయమై కండక్టర్‌పై దాడి | Woman assaults conductor | Sakshi
Sakshi News home page

TSRTC: ఆధార్‌ విషయమై కండక్టర్‌పై దాడి

Oct 8 2024 10:34 AM | Updated on Oct 8 2024 10:34 AM

Woman assaults conductor

కుషాయిగూడ: ఆధార్‌ విషయంలో ఓ ప్రయాణికురాలు, కండక్టర్‌ ఘర్షణ పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ ఆధార్‌ను కండక్టర్‌ నిరాకరించడంతో ఆగ్రహించిన ప్రయాణికురాలు కండక్టర్‌ పట్ల దురుసుగా వ్యవహరించి చేయి చేసుకుంది. దీంతో కండక్టర్‌ పోలీసులను ఆశ్రయించడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. పైగా పోలీస్‌స్టేషన్‌ గేటు వద్ద బైఠాయించి ధర్నాకు దిగింది. ఈ క్రమంలో పోలీసులు తప్పని పరిస్థితుల్లో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. 

ఈనెల 4న చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించారు. 4న ఈసీఐఎల్‌ నుంచి ఉప్పల్‌ వెళ్తున్న (ఏపీ29, జెడ్‌ 3181) ఆర్టీసీ బస్సులో కొయ్యల సరిత అనే ప్రయాణికురాలు ఎక్కింది. కండక్టర్‌ గద్ద శ్రీదేవి టికెట్‌ తీసుకుంటుండగా.. సదరు ప్రయాణికురాలు సరిత ఆంధ్రప్రదేశ్‌ అడ్రస్‌తో ఉన్న ఆధార్‌ను చూపింది. ప్రభుత్వ నింబంధనల మేరకు తెలంగాణ ఆధార్‌ మాత్రమే చెల్లుబాటు అవుతుందని, ఇది చెల్లదని టికెట్‌ కొనుగోలు చేయాలని కండక్టర్‌ సూచించింది. దీంతో ఆగ్రహించిన ఆమె కండక్టర్‌తో గొడవకు దిగి, కండక్టర్‌పై చేయి చేసుకుంది. దీంతో కండక్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకన్న తెలిపారు.  

ప్రయాణికురాలిపై గతంలోనూ పలు కేసులు 
పలువురు ప్రభుత్వ అధికారులను గతంలో బ్లాక్‌ మెయిల్‌ చేసిన ఘటనల్లో సరితపై అంబర్‌పేట్, భూపాలపల్లి జిల్లా వెంకటపురం, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement