పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌.. చికిత్స పొందుతూ విద్యార్థిని శైలజ మృతి | Wankidi Tribal student Died In NIMS, BRS demands 5050 lakh exgratia | Sakshi
Sakshi News home page

పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌.. మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థిని శైలజ

Nov 25 2024 8:31 PM | Updated on Nov 25 2024 8:35 PM

Wankidi Tribal student Died In NIMS, BRS demands 5050 lakh exgratia

సాక్షి, హైదరాబాద్‌ : కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌కి గురై గత కొన్ని రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి చెందింది. అక్టోబర్ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగగా 64 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు (మహాలక్ష్మి, జ్యోతి, శైలజ) పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించారు.

వీరిలో మహాలక్ష్మి, జ్యోతి కోలుకోగా శైలజ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆమెకు ఉపిరితిత్తుల సమస్యతో పాటు మూత్రపిండాలపై ప్రభావం పడింది. దీంతో పలుసార్లు వైద్యులు డయాలసిస్ చేశారు. ఈ నెల 11 నుంచి శైలజను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో శైలజ నేడు మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. 

కాగా దీనిపై  బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ శైలజ మృతి ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ నిర్లక్ష్యానికి బలైపోయిన వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజకు కన్నీటి నివాళి అర్పిస్తున్న‌ట్లు మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ట్వీట్ చేశారు. మీ ప్రాణాలు బలి తీసుకున్న పాపం.. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని వెంటాడుత‌ద‌న్నారు. గిరిజన విద్యార్థినీ కుటుంబానికి బాధ్యత వహించి రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పరిపాలన మరో పేదబిడ్డ ప్రాణం తీసిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత. కన్నతల్లికి కడుపు కోత మిగిల్చింది. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురై 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శైలజ మరణ వార్త తననును ఎంతగానో కలచి వేసింది అని క‌విత పేర్కొన్నారు.

ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది ప్రాణాలు బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సంక్షేమ పాఠశాలలో కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా, పదకొండు నెలల్లో 43 మంది విద్యార్థుల ప్రాణాలు తీసింది. ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలే అని క‌విత ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement