విశ్వానికి గొప్పకానుక భగవద్గీత | Sakshi
Sakshi News home page

విశ్వానికి గొప్పకానుక భగవద్గీత

Published Wed, Dec 15 2021 4:15 AM

Vishwa Hindu Parishads Laksha Yuva Gala Geetarchana Program At LB Stadium Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వేల ఏళ్ల క్రితమే ప్రపంచానికి లభించిన గొప్ప బహుమతి భగవద్గీత అని, అది భారతీయుల వారసత్వ సంపదని పలువురు ప్రముఖులు ఉద్ఘాంటించారు. భగవద్గీత ఆవిర్భావ దినోత్సవం గీతాజయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన లక్ష యువ గళ గీతార్చన కన్నుల పండువగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు, విశ్వహిందూ కార్యకర్తలు, పిల్లలు, పెద్దలు, మహిళలు, వివిధ రంగాల వారు భగవ ద్గీత ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు గంగాధర శాస్త్రి నేతృత్వంలో భగవద్గీతలోని 40 శ్లోకాలను పది నిమిషాల పాటు పారాయణం చేశారు.

వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీరామజన్మభూమి ట్రస్టు కోశాధికారి గోవింద్‌ దేవ్‌ మహారాజ్‌ మాట్లాడుతూ సంపూర్ణ విశ్వశాంతి కోసం భగవద్గీత ప్రవచించిన మార్గనిర్ధేశం ఒక్కటే పరిష్కారమన్నారు. ఇది ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప బహుమానం అని చెప్పారు. అనేక దేశాల్లో ప్రజలు భగవద్గీతను తమ జీవితానికి అన్వయించుకొని ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారని చెప్పారు.  కార్యక్రమం లో చినజీయర్‌ స్వామి మాట్లాడుతూ భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి గొప్ప వారసత్వ సంపద భగవద్గీత, రామాయణ, మహాభారత, భాగవతాది గ్రంథాలని చెప్పారు.


లక్ష యువ గళ గీతార్చన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు 

విజ్ఞాన శాస్త్రానికి అందని ఎన్నో రహస్యాలను భారతీయ వైదికగ్రంథాలు, ఉపనిషత్తులు వివరించాయన్నారు. జీవితం, ఖగోళం, కాలం వంటి అనేక అంశాలపై ప్రపంచానికి అవగాహనను, జ్ఞానాన్ని ప్రబోధించిన మహోన్నతమైన భారతదేశం, భగవద్గీత విశ్వగురువులుగా నిలిచాయన్నారు. గీత సందేశం ఎప్పటికీ కొత్తగా, వైవిధ్యంగానే ఉంటుందన్నారు. అనేక చోట్ల ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని, ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని, వాటి పరిరక్షణకు ఉద్యమించాలన్నారు. 

ఉడుపి పెజావర్‌ పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామి మాట్లాడుతూ అందరం అర్జునుడిలాగా కర్తవ్య నిర్వహణ చేస్తే సంపద, విజయం వరిస్తాయన్నారు. వీహెచ్‌పీ కేంద్రీయ ప్రధాన కార్యదర్శి మిళింద పరాండే, జాతీయ ప్రధాన కార్యదర్శి రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్‌ షో, భక్తి నృత్య గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.   

Advertisement
Advertisement