సాక్షి,నిజామాబాద్: పచ్చని సంసారాల్లో అక్రమ సంబంధాల చిచ్చు రేగుతోంది. క్షణిక సుఖాల కోసం, ప్రియుడి మోజులో పడి కొందరు మహిళలు కంటిపాపల్లా చూసుకోవాల్సిన భర్తలను కడతేరుస్తున్నారు. శృంగానికి అడ్డొస్తున్నారని కన్నప్రేమను కూడా మర్చిపోయి.. రక్తం పంచుకు పుట్టిన బిడ్డలనే గొంతు పిసికి చంపేస్తున్నారు.
ఇటీవల వెలుగులోకి వస్తున్న వరుస ఉదంతాలు సమాజంలో నైతిక విలువల పతనాన్ని కళ్ళకు కడుతున్నాయి.తాజాగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో జరిగిన ఘటనే దీనికి నిదర్శనం. ప్రియుడితో కలిసి హ్యాపీగా ఉండాలనుకున్న ఒక భార్య.. అర్ధరాత్రి వేళ భర్త మహిపాల్ను ఉరివేసి చంపేసింది. తెల్లవారాక ఏమీ తెలియనట్టు ‘గుండెపోటుతో చనిపోయాడంటూ’ ఊరంతా నమ్మించేలా హైడ్రామా ఆడింది.
కానీ, పాపం పండి మెడపై ఉన్న ఉరితాడు ‘గాటు’ను గ్రామస్తులు గమనించడంతో అసలు నిజం బయటపడింది. ఇలాంటి ‘గుండెపోటు’ స్క్రీన్ప్లేలు ఈ మధ్యకాలంలో చాలా క్రైమ్ స్టోరీల్లో కామన్ అయిపోయాయి.కాబోయే భర్తలపై కూడా కక్ష!పెళ్లి ఇష్టం లేకనో, లేదా ప్రియుడితోనే జీవితం పంచుకోవాలనే మొండి పట్టుదలతోనో.. పెళ్లి పీటలు ఎక్కాల్సిన కొందరు యువతులు కాబోయే భర్తలను కూడా టార్గెట్ చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘సియా అగర్వాల్’ ఉదంతమే దీనికి పెద్ద ఉదాహరణ. పూణెకు చెందిన కోటీశ్వరుడైన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్తో నిశ్చితార్థం జరిగిన సియాకు, అప్పటికే చేతన్ చౌదరి అనే యువకుడితో రహస్య సంబంధం ఉంది.పెళ్లి ఇష్టం లేక, అలాగని నిశ్చితార్థం రద్దు చేసుకుంటే పరువు పోతుందని భావించిన ఆమె.. పెళ్లి షాపింగ్ నెపంతో కేతన్ నుండి కోటి రూపాయలు తీసుకుని ప్రియుడికి ఇచ్చింది .ఆ తర్వాత బర్త్డే సర్ప్రైజ్ అంటూ కేతన్ను లోహగఢ్ కోటపైకి ట్రెకింగ్కు తీసుకెళ్లి, ముందే ప్లాన్ చేసుకున్న ప్రకారం ప్రియుడితో కలిసి లోయలోకి నెట్టి అత్యంత దారుణంగా హతమార్చింది.మొదట దీనిని ప్రమాదంగా నమ్మించినా, వారి కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు నిజం బయటపడి, నిందితులిద్దరూ అరెస్టయ్యారు


