
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీలో విషాదం చోటుచేసుకుంది. క్యూలెన్లలో గుండెపోటుతో వృద్ధుడు మృతి చెందాడు. మృతుడిని మెదక్ జిల్లాకు చెందని సత్యనారాయణ(75)గా గుర్తించారు. ప్రసాదం తీసుకునేందుకు క్యూ లైన్లో నిలబడిన వృద్ధుడికి గుండెపోటు రాగా.. ఆయన స్పృహ తప్పి పడిపోయారు.. వెంటనే సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వృద్ధుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
కాగా, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప మందు ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది. ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు పంపిణీ మొదలు కాగా.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఆస్తమా బాధితులు చేప మందు కోసం భారీగా తరలివచ్చారు. 42 క్యూ లైన్లలో కౌంటర్లలో పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అన్ని కౌంటర్ల వద్ద ప్రత్యేక పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.