సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేబినెట్ విస్తరణ అంశం, కొండా సురేఖ ఎపిసోడ్పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సురేఖను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కేబినెట్ విస్తరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారం జరుగుతుందని తెలిపారు.
మీడియా చిట్ చాట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే. ఢిల్లీలో కేబినెట్ విస్తరణపై చర్చ జరగలేదు. కేవలం కొండా సురేఖ, చిన్నా రెడ్డి అంశంపై మాత్రమే చర్చ జరిగింది. కేబినెట్ విస్తరణపై హై కమాండ్ నుండి ఎలాంటి సమాచారం లేదు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం. నాకు మంత్రి పదవి అనే ప్రచారంపై నాకు మాత్రం సమాచారం లేదు. అవన్నీ ఊహాగానాలే.
అలాగే, కొండా సురేఖను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించాం. సురేఖ విషయంలో అందరం మా వంతు ప్రయత్నం చేశాం. సురేఖ విషయంలో ఏఐసీసీ ఒప్పుకోలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ నెరవేర్చారు. కుల సర్వే శాస్త్రీయంగా చేశాం. రాబోయే వంద రోజులు దేశవ్యాప్తంగా బీసీ హక్కుల గర్జన చేస్తాం. బీసీ హక్కుల కోసం జరిగే గర్జనను విజయవంతం చేయండి’ అని పిలుపునిచ్చారు.
మరోవైపు.. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బండి సంజయ్, అరవింద్, ఈటల, లక్ష్మణ్ బీసీల అంశంపై స్పందించాలి. అడిగితే పదవులు పోతాయని బీజేపీ బీసీ నేతలు భయపడుతున్నారా?. తెలంగాణలో బీజేపీ ఉండాలా వద్దా తేల్చుకోండి. కుల గణనలో దేశానికి రోల్ మోడల్గా ఉన్నాం. తెలంగాణ చేసిన కులగణనలో అన్ని విషయాలు పొందుపరిచాం. మేం పంపిన ఫైల్పై కేంద్రం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. ఓబీసీల జనాభాను ఎందుకు లెక్కించడం లేదు? అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: తెలంగాణలోనూ అలాగే గెలవాలన్నది బీజేపీ ప్లాన్: రేవంత్


