57 ఎకరాలు.. రూ.22.80 కోట్లు | Three realtors arrested | Sakshi
Sakshi News home page

57 ఎకరాలు.. రూ.22.80 కోట్లు

Jul 11 2024 4:38 AM | Updated on Jul 11 2024 4:38 AM

Three realtors arrested

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి,  ఆయన కుటుంబసభ్యుల భూమివిక్రయించే యత్నం  

ముగ్గురు రియల్టర్ల అరెస్టు

జోగిపేట(అందోల్‌): ఓ రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 57 ఎకరాల వ్యవసాయ భూమిని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విక్రయించేందుకు యత్నించిన ముగ్గురు రియల్టర్లను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీఐ అనిల్‌కుమార్‌ చెప్పిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అందోలు శివారులో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, సైబరాబాద్‌ మాజీ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబానికి చెందిన అంజమ్మ, నర్సింహారెడ్డి, గోపాల్‌రెడ్డిలకు 57 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నారాయణఖేడ్‌ పరిధిలోని ర్యాకల్‌ గ్రామానికి చెందిన సంజీవరెడ్డి, దెగుల్వాడీ గ్రామానికి చెందిన సుధాకర్, ముకుందానాయక్‌ తండాకు చెందిన రవీందర్‌లు రియల్టర్లు. వీరు ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు చెందిన వ్యవసాయభూమిని ఎకరాకు రూ.39 లక్షల చొప్పున కొనుగోలు చేసినట్టు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. 

ఇదే భూమిని హైదరాబాద్‌కు చెందిన యాదగిరిరెడ్డికి ఎకరాకు రూ.40 లక్షలు చొప్పున రూ.22.80 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌ కింద మే 3వ తేదీన యాదగిరిరెడ్డి తన స్నేహితుడు వాసుదేవరెడ్డి ఖాతా ద్వారా రూ.11లక్షలు సంజీవరెడ్డికి చెల్లించారు. నెలరోజుల తర్వాత భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు సంజీవరెడ్డికి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు. దీంతో యాదగిరిరెడ్డికి అనుమానం వచి్చంది. దీంతో అందోలు గ్రామంలోని ప్రభాకర్‌రెడ్డి వద్దకు వెళ్లి ఆరా తీయగా.. తాము ఈ భూమిని ఎవరికి విక్రయించలేదని చెప్పడంతో యాదగిరిరెడ్డి కంగుతిన్నాడు.

తన దగ్గర ఉన్న డాక్యుమెంట్‌ కాపీలను చూపించగా, అవి నకిలీవని తేలాయి. దీంతో సంగారెడ్డి ఎస్పీ రూపే‹Ùకు ప్రభాకర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు జోగిపేట సీఐ నేతృత్వంలోని పోలీసుల బృందం విచారణ చేపట్టింది. నిందితులు సంజీవరెడ్డి, సుధాకర్, రవీందర్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్‌ శివ, హోంగార్డు సురేశ్‌లను సీఐ అభినందించారు. వీరికి రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement