నల్గొండ జిల్లా: చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు వెళ్తున్న వాహనం టైర్ పేలడంతో అదుపుతప్పింది. డివైడర్ దాటి హైదరాబాద్ వైపు రోడ్డుపై బోల్తా పడింది. బోల్తా పడిన వాహనాన్ని హైదరాబాద్ వైపు వెళ్తున్న మరో రెండు కార్లు ఢీకొట్టాయి. వరుసగా మూడు కార్లు బోల్తా పడటంతో హైదరాబాద్ వైపు సుమారు 5 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జాం అయ్యింది.
ప్రమాదంలో సుమారు 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న ట్రాఫిక్, ఎన్హెచ్ఏఐ సిబ్బంది పోలీసులు.. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.


