హైదరాబాద్: బాల్య వివాహాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మంత్రి సీతక్క సమక్షంలో ప్రభుత్వం, తరుణి సంస్థ మధ్య ఎంఓయూ కుదిరింది. బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణల నివారణే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించింది. ‘‘బాల్య వివాహం-బతుకు ఆగం’’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనుంది ప్రభుత్వం.
సోషల్ మీడియా ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... ‘‘బాల్య వివాహం కుటుంబ సమస్య మాత్రమే కాదు.. సామాజిక సమస్య. బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. బాల్య వివాహాల వల్ల బాలికల చదువు మధ్యలోనే ఆగిపోతుంది. బాల్య వివాహాలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి.
బాలికల ఆర్థిక స్వావలంబనపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ‘బాల్య వివాహం–బతుకు ఆగం’ నినాదంతో ప్రచారం నిర్వహిస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని మరింత విస్తరిస్తాం. బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణల నివారణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు చేపడతాం.
బాలికలకు హక్కులు, ఆరోగ్యం, విద్యపై అవగాహన కల్పిస్తాం. క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణలు అందిస్తాం. బాల్య వివాహాల దుష్పరిణామాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తాం. బాలికల విద్య, ఆరోగ్యం, సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతి బాలిక తన కలలను సాకారం చేసుకునే వాతావరణం కల్పించాలి. బాల్య వివాహాలకు ముగింపు పలకడానికి అందరూ కలిసి పనిచేయాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజం సమష్టిగా ముందుకు రావాలి’’ అని పిలుపునిచ్చారు.


