పెండింగ్‌ బిల్లులు చెల్లించామనడం అవాస్తవం | Telangana Sarpanchs Association JAC on Pending Bills | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ బిల్లులు చెల్లించామనడం అవాస్తవం

Nov 25 2024 4:41 AM | Updated on Nov 25 2024 4:41 AM

Telangana Sarpanchs Association JAC on Pending Bills

అబద్ధాలు చెప్పడం సీఎం స్థాయికి తగదు 

డిసెంబర్‌ 1 వరకు బిల్లులు చెల్లించకపోతే ఆందోళనకు దిగుతాం 

తెలంగాణ సర్పంచ్‌ల సంఘం జేఏసీ

సాక్షి, హైదరాబాద్‌: గ్రామాల్లో గతంలో సర్పంచ్‌లు చేసిన అభి వృద్ధి పనులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయనప్పటికీ రూ.750 కోట్ల పెండింగ్‌ బిల్లులను చెల్లించేశామని ప్రభు త్వం పేర్కొనడం అవాస్తవమని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆరోపించింది. పెండింగ్‌ బిల్లులు చెల్లించామని అబద్ధాలు చెప్పడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థాయికి తగదని సంఘం నేతలు పేర్కొన్నారు. 

ఈ మేరకు సర్పంచుల సంఘం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డిలు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘2024 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌ (ఎస్‌డీఎఫ్‌) నిధులు, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎఫ్‌సీ) నిధులు ఇవ్వలేదు. జనరల్‌ నిధులపైనా ఫ్రీజింగ్‌ ఇంకా ఎత్తివేయలేదు. ఇప్పటికీ గత సర్పంచుల చెక్కులు ట్రెజరీలోనే ఉన్నాయి’అని వారు పేర్కొన్నారు. 

ఆందోళనకు దిగుతాం.. 
రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడుస్తున్నా.. సర్పంచ్‌లపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని సర్పంచుల సంఘం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆరోపించింది. డిసెంబర్‌ 1వ తేదీ వరకు పెండింగ్‌ బిల్లులు చెల్లించకపోతే తెలంగాణ మొత్తం 12,769 సర్పంచ్‌ల కుటుంబ సభ్యులతోపాటు ప్రజలను కూడగట్టుకొని ఆందోళనకు దిగుతామని స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement