
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేపటి నుంచి రేషన్ దుకాణాలు(Telangana Ration Shops) మూతపడనున్నాయి. పలు డిమాండ్లతో రేషన్ డీలర్ల సంఘం చేపట్టిన నిరసనలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గత 5 నెలలుగా రేషన్ డీలర్లకు(Ration Dealers Commission) కమీషన్ అందలేదు. దీనికి తోడు రూ.5 వేల కనీస గౌరవ వేతనం డిమాండ్ చేస్తున్నారు డీలర్లు. ఈ క్రమంలో వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలియజేస్తూ వచ్చారు. రేషన్ డీలర్ల సంఘం నాయకులు సోమవారం 33 జిల్లాల్లో కలెక్టర్లకి వినతి పత్రాలు సమర్పించారు కూడా. అయితే ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని డీలర్ల సంఘం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో..
ఇక బియ్యం పంపిణీ చేసేది లేదని రేషన్ డీలర్ల సంఘం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశంలో ఎక్కడా కమీషన్ను ప్రభుత్వం పెండింగ్ పెట్టిన దాఖలాలు లేవని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt Ration Shops) స్పష్టత ఇస్తేనే తిరిగి రేషన్ షాపులు తెరుస్తామని అంటున్నారు.
రేషన్ డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. కమీషన్ పెంచాలి. దుకాణాల అద్దె, బియ్యం రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరించాలి లాంటి డిమాండ్లు ఉన్నాయి. ఈ బంద్ నిరవధికమా? లేదంటే రేపు ఒక్కరోజేనా? అనేదానిపై రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: అక్టోబర్ 2నే దసరా.. మద్యం, మాంసం అమ్మితే కఠిన చర్యలే!