KTR: వసూలు ఇక్కడ.. ఖర్చు అక్కడా?

Telangana Minister KT Rama Rao Slams Centre - Sakshi

రాష్ట్రం చెల్లిస్తున్న పన్నుల్లో తిరిగి సగం కూడా ఇవ్వడం లేదు

బుల్లెట్‌ ట్రైన్‌ దక్షిణాది రాష్ట్రాలకు ఎందుకు రావడం లేదు?

విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలి

రాష్ట్ర పారిశ్రామిక అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ రాష్ట్రం చెల్లిస్తున్న పన్నులను కేంద్రం యూపీ, బిహార్, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో ఖర్చు చేస్తోంది. తెలంగాణ చెల్లించే ప్రతిపైసా తిరిగి రాష్ట్రానికే రావాలని మేము కోరు కోవడం లేదు. కేంద్రానికి చెల్లిస్తున్న పన్నుల్లో కనీ సం సగం కూడా తిరిగి రాష్ట్రానికి ఇవ్వ డం లేదు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను పునస్స మీక్షించి, వాటిని నెరవేర్చాలి’ అని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ‘మ్యాన్‌ఎక్స్‌ 2021’ సదస్సులో కేటీఆర్‌ కీలకోప న్యాసం చేశారు.

‘పెట్టుబడులతో వచ్చే వారికి ప్రోత్సాహకాలు, భూములు, విద్యుత్, శాంతి భద్రతలతోపాటు మానవ వనరులు కూడా ముఖ్యమే. దీని కోసం ఐఐఎం, ఎన్‌ఐడీ, ట్రిపుల్‌ ఐటీ కరీంనగర్, ఐసెర్, ట్రైబల్‌ వర్సిటీలు, మెడికల్‌ కాలేజీలను రాష్ట్రానికి మం జూరు చేయాలని కేంద్రాన్ని కోరాం. బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చినా ఢిల్లీ నుంచి గుజరాత్‌ మీదుగా ముంబైకి వెళ్తుందే తప్ప హైదరాబాద్‌ లేదా దక్షిణాదికి ఎందుకు రాదు? దేశం స్వయం స్వావలంబన దిశగా పయనించాలనుకుంటే తెలంగాణ లాంటి రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలి’ అని వ్యాఖ్యానించారు.

ఏడున్నరేళ్లుగా శూన్యహస్తం..
‘దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.5 శాతమే అయినా దేశ జీడీపీకి 5శాతం సమకూరుస్తోంది. భౌగోళికంగా 12వ అతిపెద్ద రాష్ట్రమైనా మా కంటే పెద్ద రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత దేశ జీడీపీ సమకూర్చంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ప్రగతిశీల విధానాలతో దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషి స్తున్న తెలంగాణను వెన్నుతట్టి ప్రోత్సహించాలని కేంద్రానికి అనేక వినతలు చేశాం. స్థానికంగా ఉద్యోగాల కల్పన కోసం భారీ పారిశ్రామిక పార్కులకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. చైనా వంటి పెద్ద దేశాలతో ఉత్పత్తి రంగంలో పోటీ పడాలంటే చిన్న పారిశ్రామిక పార్కులతో సాధ్యం కాదు. రాష్ట్రం ఏర్పాటు చేసిన మెగా పారిశ్రామిక పార్కులు ఫార్మాసిటీ, మెగా టెక్స్‌టైల్‌ పార్కులను కేంద్రం పట్టించుకోవడం లేదు. దేశం స్వయం స్వావలంబన సాధించేందుకు చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణలోకి రావాలి. 2014కు ముందు నాటి యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రద్దు చేసిన కేంద్రం, ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారో చెప్పడం లేదు’అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌ సమయంలో అండగా నిలిచాం..
కోవిడ్‌.. లాక్‌డౌన్‌ సమయంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కోవడంలో పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) కాపాడుకునేందుకు కేంద్రంతో అనేకమార్లు సమన్వయం చేశాం. అయితే వీటిని ఆదుకునేందుకు కేంద్ర ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కంటి తుడుపు కాకుండా ఉద్యోగాల కల్పన, పురోగతికి దోహదం చేసేలా ఉండాలి. కేంద్రం ప్రకటించిన ఈ ప్యాకేజీ ఎంఎస్‌ఎంఈలపై ఆశించిన ప్రభావం చూపలేదు.

కోవిడ్‌ సమయంలోనూ తెలంగాణలో అనేక ప్రముఖ సంస్థలు పెట్టుబడులతో ముందుకొచ్చాయి. తైవాన్, కొలంబియా, పోలండ్, ఫ్రాన్స్, డెన్మార్క్‌ వంటి దేశాల నుంచి కూడా పెట్టుబడులు వచ్చాయి’అని కేటీఆర్‌ ప్రకటించారు. కార్యక్రమంలో భాగంగా ఎగుమతులు, ఆవిష్కరణలు, ఉత్తమ విధానాలు, ఉత్తమ స్టార్టప్‌లు తదితరాలకు సంబంధించి ఆరు కేటగిరీల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ తరఫున విజేతలకు కేటీఆర్‌ అవార్డులు అందజేశారు. సీఐఐ భాగస్వామ్యంతో ‘ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీస్‌’అవార్డులను కూడా అందజేశారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్, సీఐఐ తెలంగాణ చైర్మన్‌ సమీర్‌ గోయల్, సీఐఐ కన్వీనర్‌ శోభా దీక్షిత్‌ తదితరులు పాల్గొన్నారు. 

దేశం నడిబొడ్డున ఉన్న తెలంగాణ, ప్రత్యేకించి హైదరాబాద్‌ దేశానికి ఆర్థిక ఇంజిన్‌గా పనిచేస్తోంది. హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–నాగపూర్, హైదరాబాద్‌–వరంగల్, హైదరాబాద్‌– విజయవాడ నడుమ పారిశ్రామిక కారిడార్ల కోసం అనేక విన తులు చేశాం. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ, ఏపీలో పారిశ్రామీకరణ, ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించేందుకు ఇన్సెంటివ్‌లు ఇస్తామని కేంద్రం ప్రకటించినా.. ఏడున్నరేళ్లుగా శూన్య హస్తమే ఎదురవుతోంది.
– కేటీఆర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top