కేసులు పెరుగుతున్నాయి.. జాగ్రత్త!  | Telangana Minister Harish Rao Says Rising Covid 19 Cases | Sakshi
Sakshi News home page

కేసులు పెరుగుతున్నాయి.. జాగ్రత్త! 

Jun 5 2022 1:48 AM | Updated on Jun 5 2022 8:31 AM

Telangana Minister Harish Rao Says Rising Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రజలు కోవిడ్‌–19 నిబంధనలు తప్పకుండా పాటించాలని, మాస్కు ధరించాలని సూచించారు. శనివారం రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఐడీసీ) కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు.

ప్రపంచవ్యాప్తంగా రోజూ కరోనా కేసులు పెరుగుతున్నాయని, అమెరికాలో రోజుకు లక్ష కేసులు, ఉత్తర కొరియాలో 80 వేలు, జర్మనీలో 50 వేల కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో కూడా పాజిటివిటీ రేటు పెరిగిందని, తెలంగాణలో పెద్దగా ప్రభావం లేనప్పటికీ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కోవిడ్‌ కేసులు పెరిగినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందన్నారు. పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలు సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్స, వ్యాక్సినేషన్‌ పక్కాగా, ఉచితంగా జరిగేలా వైద్య ఆరోగ్య సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు.

పీహెచ్‌సీ నుంచి బోధనాస్పత్రుల వరకు అన్నీ కోవిడ్‌ చికిత్స అందించడానికి సిద్ధంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెం దాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా టీకాలు ఫస్ట్‌ డోస్‌ వంద శాతం, సెకండ్‌ డోస్‌ 99 శాతం పూర్తి అయిందని, ఇంకా 33 లక్షల డోసుల వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.

అరవై ఏళ్లు దాటినవారికి బూస్టర్‌ డోస్‌ 16.8 శాతం వేశామని, ఇంకా వేసుకోనివారిని గుర్తించి అందించాలన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా వ్యాక్సిన్‌ వేసుకోనివాళ్లను ఆరోగ్య కార్యకర్తలు గుర్తిం చి ఇంటింటికీ వెళ్లి వేయాలని మంత్రి ఆదే శించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ కా ర్యదర్శి రిజ్వీ, టీఎస్‌ఎంఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement