
ఫిలిప్పీన్స్కు ఎగుమతి ద్వారా మిగులు ధాన్యానికి పరిష్కారం: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్/ఏజీవర్సిటీ: దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో ఈ ఏడాది తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో సుమారు 280 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని, ఇది ఒక రికార్డు అని చెప్పారు. తెలంగాణ నుంచి తొలిసారి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతి అవుతున్న నేపథ్యంలో మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘బియ్యం ఎగుమతి విధానం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఉత్తమ్కుమార్ మాట్లాడారు.
రాష్ట్ర అవసరాలు, ఎఫ్సీఐ సెంట్రల్ పూల్, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీ తదితరాలకు పోగా ఏటా 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిగులు ఉంటుందన్నారు. మిగులు ధాన్యం మార్కెట్ చేయడానికి ఫిలిప్పీన్స్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఒప్పందంలో భాగంగా ఏడాదికి 10 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని ఎగుమతి చేసే అవకాశం ఉంటుందన్నారు.
ఇటీవల వరి సాగు విధానంలో కూడా మార్పు వచ్చిందని, దాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వరి నేరుగా విత్తే పద్ధతి (డీఎస్ఆర్), రోజు విడిచి రోజు నీరు పెట్టే విధానం (ఏడబ్ల్యూడీ), తక్కువ రసాయనాలు కలిగిన వరి రకాలను ఉత్పత్తి చేయడంపై రైతులను ప్రోత్సహించాలని శాస్త్రవేత్తలకు మంత్రి సూచించారు. ఎగుమతికి అనుకూలమైన రకాలను ఉత్పత్తి చేసే రైతులకు, ఎగుమతిదారులకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య మాట్లాడుతూ ఫిలిప్పీన్స్ దేశం ఎప్పటికీ దిగుమతి చేసుకునే దేశమేనని, ఆ దేశాన్ని తెలంగాణ బియ్యానికి అనుకూలమైన మార్కెట్గా గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. తద్వారా తెలంగాణలో పండుతున్న బియ్యం నిల్వలకు శాశ్వత పరిష్కారం దొరికినట్లవుతుందని చెప్పారు. కార్యక్రమంలో అఖిలభారత రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బి.కృష్ణారావు, విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు డాక్టర్ బలరాం, వరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర్ రాజు పాల్గొన్నారు.