తెలంగాణకు నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష | Telangana: KTR Launches Several Development Works | Sakshi
Sakshi News home page

అడ్డుపడినా.. అభివృద్ధి ఆగదు..

Jan 30 2022 1:38 AM | Updated on Jan 30 2022 2:03 AM

Telangana: KTR Launches Several Development Works - Sakshi

జల్‌పల్లిలో మాట్లాడుతున్న కేటీఆర్‌.  చిత్రంలో సబితా ఇంద్రారెడ్డి 

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఎవరెన్ని కుట్రలు చేసినా రాజకీయాలకతీతంగా రాష్ట్రంలోని అన్ని నియోజ కవర్గాలను అభివృద్ధి చేసి తీరుతాం’అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం, మంత్రుల పర్యటనలను అడ్డుకోవడం సరికాదని, దమ్ము ఉంటే కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో పోటీ పడాలి’ అని బీజేపీ నేతలకు సవాల్‌ విసిరారు. ‘అధికారం ఎవరి సొత్తు కాదని,  మీరు దేశంలో అధికారంలో ఉన్నారు. ఈ ఏడున్నరేళ్లలో రాష్ట్రం కోసం చేశారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నా’అని నిలదీశారు శనివారం రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ, జల్‌పల్లి, మీర్‌పేట్, బడంగ్‌పేట్‌ పుర/నగర పాలికల పరిధిలో రూ.371.09 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

అనంతరం బడంగ్‌పేట్‌ క్రికెట్‌ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడారు. గతేడాది అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు నగరంలో అనేక కాలనీలు మునిగి పోయాయని, ఆర్థిక సహాయం చేయాలని కేంద్రాన్ని కోరినా అరపైసా కూడా ఇవ్వలేదని, గుజరాత్‌లో వరదలొస్తే ప్రధాని మోదీ తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు ఇచ్చారన్నారు. మోదీ సర్కార్‌ తెలంగాణ ప్రభుత్వానికి సహకరిం చకపోగా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజ కీయ లబ్ధిపొందాలని చూస్తోందని మండిపడ్డారు. 

ఒక్క విద్యాసంస్థనూ మంజూరు చేయలేదు..
మన ఊరు– మనబడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.7,289 కోట్లతో 26 వేల పాఠశాలను సంస్క రించుకుంటున్నామని కేటీఆర్‌ తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేసి 950 గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య ను అందిస్తున్నామని చెప్పారు. కేంద్రం మాత్రం రాష్ట్రానికి కొత్తగా ఒక్క నవోదయ పాఠశాలను కూడా కేటాయించలేదని విమర్శించారు.

దేశవ్యా ప్తంగా 16 ఐఐఎంలు మంజూరు చేస్తే, తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా అని మండిపడ్డారు. ప్రభు త్వ ఆస్పత్రులను అభివృద్ధి చేశామని, కేసీఆర్‌ కిట్టు వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 50 శాతం పెరిగాయని గుర్తు చేశారు. కార్యక్రమాల్లో  మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు  పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement