
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మిడియెట్ కాలేజీలకు వేసవి సెలవులు ఇచ్చినా అందుకు విరుద్ధంగా ప్రైవేటు కాలేజీల్లో జరుగుతున్న తరగతుల నిర్వహణపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేస్తూ ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని జస్టిస్ సూరేపల్లి నందా, జస్టిస్ జె.శ్రీనివాస్రావు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇంటర్ బోర్డు జారీ చేసిన వార్షిక కేలండర్లో ప్రకటించిన విధంగా ప్రైవేట్ కళాశాలలు సెలవులు ప్రకటించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బందెల క్రాంతికుమార్ తరఫున న్యాయవాది సీఆర్ సుకుమార్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఆదివారాలు, ప్రభుత్వ సెలవు రోజులు అని తేడా లేకుండా తరగతులను నిర్వహిస్తున్నారని.. దీనివల్ల విద్యార్థులు ఒత్తిడి, మానసిక రుగ్మతలకు గురై ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయా కాలేజీలు వెంటనే తరగతుల నిర్వహణను ఆపేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఇలాంటి వాటిపై ఫిర్యాదులు తీసుకోవడానికి ఓ పోర్టల్ను ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు.
అయితే రాష్ట్రంలోని ఏ ప్రైవేట్ జూనియర్ కాలేజీ కూడా వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించట్లేదని స్పెషల్ జీపీ వాదించారు. ట్యూషన్లు, కోచింగ్ తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై ఇంటర్ బోర్డుకు నియంత్రణ లేదన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు సమయం కావాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. ఏజీ హాజరై వాదనలు వినిపిస్తారని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో తదుపరి విచారణను వాయిదా వేసింది.