కారణాలేంటో తెలియజేయండి  | Telangana High Court Order To NTA On Reduction Of NEET Marks | Sakshi
Sakshi News home page

కారణాలేంటో తెలియజేయండి 

Oct 8 2022 1:10 AM | Updated on Oct 8 2022 1:10 AM

Telangana High Court Order To NTA On Reduction Of NEET Marks - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌)–2022కు హాజరైన విద్యార్థి జోత్స్నకు తొలుత ఓ మార్కులు(482), తర్వాత మరో మార్కుల(294)ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడానికి గల కారణాలను తెలిపాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)ను హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 11వ తేదీలోపు కారణాల నివేదికను కోర్టు ముందుంచాలని స్పష్టం చేసింది.

కారణం చూపించకుండా ఎన్‌టీఏ తన మార్కులను 482 నుంచి 294కు తగ్గించడాన్ని సవాల్‌ చేస్తూ జీఎస్‌ జోత్స్న హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌ సీహెచ్‌ సుమలతతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎన్‌.ఎస్‌.అర్జున్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. నీట్‌(యూజీ)కు హాజరైన జోత్స ్నకు తొలుత 482 మార్కులు వచ్చాయన్నారు.

ఆలిండియాస్థాయిలో 1,00,456 ర్యాంక్, ఓబీసీ కేటగిరీలో 50,567 ర్యాంక్‌ వచ్చిందన్నారు. ఈ మేరకు ఫలితాలు వచ్చిన సెప్టెంబర్‌ 7న ఎన్‌టీఏ ఫలితాన్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిందన్నారు. తర్వాత కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ అప్‌లోడ్‌ చేసిన జాబితా చూసి పిటిషనర్‌ షాక్‌కు గురయ్యారని చెప్పారు. మార్కులను 294కు తగ్గించారని, ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ను తెరిచి చూడగా.. ఇదే మార్కులను చూపించిందన్నారు.

దీంతో ర్యాంక్‌ ఆలిండియా స్థాయిలో 3,32,143కి, ఓబీసీ స్థాయిలో 1,44,313కి పెరిగిందన్నారు. దీనిపై ఎన్‌టీఏకు ఎన్నిసార్లు ఈ–మెయిల్‌ పంపినా స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. ఎన్‌టీఏ తరఫున న్యాయవాది బి.కవిత యాదవ్, కాళోజీ వర్సిటీ తరఫున న్యాయవాది ఎ. ప్రభాకర్‌రావు హాజరయ్యారు. వాదనలు విన్న ధర్మానసం తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.   

Advertisement
 
Advertisement
Advertisement