7 నుంచి ఎడ్‌సెట్‌ దరఖాస్తుల స్వీకరణ

Telangana EDCET 2022 Notification Released Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎడ్‌సెట్‌–2022కు ఈ నెల 7 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. అప్లికేషన్లను జూన్‌ 15లోగా, రూ. 500 పెనాల్టీతో జూలై 1 వరకూ పంపొచ్చని స్పష్టం చేశారు. ఇందుకు షెడ్యూల్‌ను సోమవారం తన కార్యాలయంలో ఆయన విడుదల చేశారు.

ఎడ్‌సెట్‌ పరీక్ష జూలై 26, 27 తేదీల్లో 19 ప్రాంతీయ కేంద్రాల్లో జరుగుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 17, ఏపీలో విజయవాడ, కర్నూల్‌ ప్రాంతీయ కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఉస్మానియా వర్సిటీ నేతృత్వంలో జరిగే ఎడ్‌సెట్‌కు ఫీజు రూ. 650 (ఎస్సీ, ఎస్టీలు, పీహెచ్‌లకు రూ. 450)గా నిర్ణయిం చినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన బీఈడీ కాలేజీలు 220 ఉన్నాయని, వీటిల్లో 19,600 సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

గతేడాది 33,683 మంది బీఈడీలో అర్హత సాధించారని తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ (హోం సైన్స్‌), బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీఏ (ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌), బీటెక్, బీబీఏ లేదా మాస్టర్‌ డిగ్రీని 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. ఆఖరి సంవత్సరం డిగ్రీ విద్యార్థులు కూడా బీఎడ్‌ సెట్‌ రాసేందుకు అర్హులే.

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల స్వీకరణ        -ఏప్రిల్‌ 7 నుంచి జూన్‌ 15 వరకు
రూ. 500 పెనాల్టీతో            -జూలై 1 వరకు
ఫీజు వివరాలు                   -రూ. 650 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌లకు రూ. 450)
పరీక్ష తేదీలు                     -జూలై 26, జూలై 27

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top