సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట లభించింది. డీజీపీ శివధర్రెడ్డి నియామక ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. డీజీపీ నియామకాన్ని సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. రెగ్యులర్ ప్రాసస్ను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.
డీజీపీ నియామకం కోసం యూపీఎస్సీ ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించిన కోర్టు.. యూపీఎస్సీకి పంపిన తరువాత కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి తెలిపింది. డీజీపీ నియామక ఆర్డర్ను సస్పెండ్ చేయాలన్న IA(ఇంట్రిమ్ ఆప్లికేషన్)ను హైకోర్టు కొట్టివేసింది. తదుపరి విచారణను వచ్చే నెల ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది.
రాష్ట్ర డీజీపీగా బి.శివధర్రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన సామాజిక కార్యకర్త టి.ధన్గోపాల్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2025 సెప్టెంబర్లో సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులు.. 2018 నాటి సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై జస్టిస్ పుల్ల కార్తీక్ నిన్న (గురువారం జనవరి 8) మరోసారి విచారణ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి, కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ, యూపీఎస్సీ కౌన్సెల్ అజయ్కుమార్ కులకర్ణి వాదనలు వినిపించారు.
కోర్టు ఆదేశాల మేరకు తాము యూపీఎస్సీకి జాబితాను పంపామని, కమిషన్ దాన్ని తిప్పి పంపిందని ఏజీ అన్నారు. కోర్టు ఉత్తర్వులు యూపీఎస్సీకి కూడా వర్తిస్తాయని, రాష్ట్ర జాబితాను తిరిగి పంపకూడదన్నారు. పిటిషనర్ లేవనెత్తిన ప్రశ్న సరైంది కాదన్నారు. రాష్ట్ర సిఫార్సులను పునఃపరిశీలించేలా యూపీఎస్సీని ఆదేశించాలని కోరారు.

ఈ విషయంలో కేంద్ర హోం శాఖకు ఎలాంటి పాత్ర లేదని ఏఎస్జీ పేర్కొన్నారు. ఇది రాష్ట్రానికి, యూపీఎస్సీకి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల అంశమని తెలిపారు. రాష్ట్రం వైపు నుంచి జరిగిన జాప్యం, డీజీపీల నియామకానికి సంబంధించి సుప్రీం ఆదేశాల దృష్ట్యా అటార్నీ జనరల్ను న్యాయ సలహా కోరామన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు నుంచే స్పష్టత కోరాలని ఆయన సూచించారన్నారు. వాదనలు విన్న జడ్జి.. ఇవాళ(శుక్రవారం) తీర్పు వెల్లడించారు.


