సాక్షి, నాగర్ కర్నూల్: కుమ్మెరలో జరిగిన ఘటన అమానవీయం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దేవుడి దర్శనం కోసం వెళ్తే దాడికి పాల్పడటం దారుణమన్నారు. కుమ్మెర ఘటన మానవత్వానికి మచ్చ.. తెలంగాణ సమాజం తలదించుకునే దుర్మార్గమైన ఘటనగా కేటీఆర్ అభివర్ణించారు. కులాలు మతాలు పేరిట అవమానించటం.. హత్య రాజకీయాలు చేస్తోన్నవారికి అండగా నిలిచిన వారిది కూడా తప్పేనని కేటీఆర్ అన్నారు.
గణేష్పై అమానుషంగా దాడి చేశారు. మౌనిక ప్రాధేయపడిన కూడా వినకుండా పసిపాపను కాలుతో తన్నితే చనిపోయింది. శిక్షించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు?. ఇక్కడి పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉంది. ఇక్కడి పోలీసులు రాజ్యాంగాన్ని ఖననం చేస్తున్నారు. దుర్ఘటనలో 8 మంది నిందితులను తక్షణమే హత్యానేరం కింద అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పసిగుడ్డు మృతికి కారకులైన దుండగులను ఉరితీసినా తప్పులేదు. ప్రభుత్వం కూడా స్పందించాలి. కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు.


